Share News

విహారయాత్రలో విషాదం

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:40 AM

విహారయాత్ర ఆ స్నేహితుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎంతో ఆనందంతో బయలుదేరగా, వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.

విహారయాత్రలో విషాదం
ప్రమాదంలో దెబ్బతిన్న కారు

కారు అదుపు తప్పిన ఘటనలో ఇద్దరు మృతి

మృతులది హైదరాబాద్‌లోని యాకతపుర

పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్‌ 24: విహారయాత్ర ఆ స్నేహితుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎంతో ఆనందంతో బయలుదేరగా, వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. బుధవారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఈ సంఘటన జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని యాకతపుర ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ అజహర్‌(32), అతడి ముగ్గురు స్నేహితులు సమీరాబేగం(25), జహీర్‌, మధియ కలిసి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌కు విహారయాత్రకు హైదరాబాద్‌ నుంచి కారులో ఉదయం బయలుదేరారు. మధ్యాహ్నం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం ఘనపురం స్టేజీ శివారు కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిలోని ఏఎమ్మార్పీ ప్రధానకాల్వ వద్దకు రాగానే కారు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న హెచఎండబ్యూఎ్‌స గేట్‌వాల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముందు కూర్చున్న అజహర్‌, సమీరాబేగం అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీటులో ఉన్న జహీర్‌, మధియలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఇద్దరి మృతదేహాలను దేవరకొండ మార్చురీకి తరలించారు. జహీర్‌ సోదరుడు ఫారీద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 12:40 AM