ఓటర్లకు అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:09 AM
స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకుడు రాబర్ట్సింగ్ క్షేత్రిమాయుమ్ ఏఆర్వో, నోడల్ అధికారులకు సూచించారు.
ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాబర్ట్సింగ్
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 27: స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకుడు రాబర్ట్సింగ్ క్షేత్రిమాయుమ్ ఏఆర్వో, నోడల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో శనివారం ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్ రంజన్, సాయన్ దేబర్మలతో కలిసి కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీసీపీతోపాటు ఏఆర్వోలు, వివిధ విభాగాల నోడల్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పూర్తి అప్రమత్తతతో ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు స్వీప్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఒకే లొకేషన్లో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నచోట మెడికల్టీంలు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో విధులు నిర్వహించాలన్నారు. వెబ్ క్యాస్టింగ్, మైక్రో పరిశీలకుల ద్వారా పోలింగ్ ప్రక్రియను పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు పకడ్బందీగా చేపట్టాలని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రతీఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, హోం ఓటింగ్లో అత్యంత గోప్యత పాటించాలన్నారు. ‘సీ’ విజిల్ యాప్ ద్వారా నిబంధనల ఉల్లంఘనపై ప్రజలు ఫిర్యాదులు చేసేలా చైతన్యం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో స్వీప్ కార్యక్రమాలు విస్తృతంగా చేయాలన్నారు. ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే ఎన్నికల ఏర్పాట్లపై చేపట్టిన చర్యలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య, స్వీప్ కార్యక్రమాలు, ఎపిక్ కార్డుల పంపిణీ, 85 ఏళ్లకు పైబడిన వారికోసం హోం ఓటింగ్, అత్యవసర విభాగా ల సిబ్బందికి 12-డీ ఫాంలు, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటివరకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 124 కేసుల్లో రూ.3.80 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీటిలో 102 కేసులకు సంబంధించి రూ.3.28కోట్ల నగదు గ్రీవెన్స్ కమిటీ ద్వారా ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా రూ.3.09కోట్లు, రూ. 4.29లక్షల ఆభరణాలు, రూ.83.72లక్షల విలువైన బహుమతులు, రూ.2.71కోట్ల మద్యం, రూ.1.72కోట్ల డ్రగ్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు, భువనగిరి అరోర కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన ట్లు, ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్, పోలింగ్ సిబ్బంది వివరాలు, ఎన్నికల నిబంధనలను పాటించేలా ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వైలైన్లు టీంలు నిర్వహిస్తున్న పనులను వివరించారు. అనంతరం డీసీపీ ఎం.రాజే్షచంద్ర ఎన్నికల ఏర్పాట్లలో చేపట్టాల్సి బందోబస్తు చర్యలు, చెక్పోస్టుల పనితీరు, బందోబస్తు, ఈవీఎం యంత్రాల భద్రతపై వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు పి.బెన్ షాలోమ్, కే.గంగాధర్, భువనగిరి, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, మునుగోడు, జనగాం, నకిరేకల్ ఆర్డీవోలు పి.అమరేందర్, కే.అనంతరెడ్డి, బిఎస్ లత, డి.సుబ్రమణ్యం, డి.కొమురయ్య, పూర్ణచందర్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.