రైతుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:03 AM
కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోందని, వారి సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.
మూడుచింతలపల్లి, ఏప్రిల్ 27 : కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోందని, వారి సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. శనివారం మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతుల సమస్యల పై రైతులతో పాటు ఎంపీ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి పోస్టుకార్డు ప్రదర్శన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. రైతు సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అందించిన సాగు నీరు, పంట పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులను కాంగ్రెస్ ప్రభుత్వం అందించకపోగా.. రైతు బీమాను ఎత్తివేయడం దురదృష్టకరమన్నారు. బీజేపీ.. రైతాంగ సమస్యలపై ఢిల్లీలో పదిహేను నెలలు ధర్నా చేసినందుకు 700 మందిని పొట్టనపెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతంగానికి కావాల్సిన నిరంతర విద్యుత్, సాగునీటి సరఫరా, ఎరువుల పంపిణీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైతు బీమాను అందించి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రైతులతో పాటు తాను పోస్టు కార్డులను సీఎం కార్యాలయానికి పంపించడం జరుగుతుందన్నారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ వార్డుసభ్యులు, బీఆర్ఎస్ గ్రామాఽధ్యక్షుడు, గ్రామస్తులు పాల్గొన్నారు.