చివరి దశకు నామినేషన్లు
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:30 AM
నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగుస్తుండడంతో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలుచేస్తున్నారు.
చేవెళ్ల స్థానానికి ఆరో రోజు 19, మల్కాజిగిరికి 38
రంగారెడ్డి అర్బన్/మేడ్చల్, ఏప్రిల్ 24 : నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగుస్తుండడంతో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలుచేస్తున్నారు. బుధవారం ఆరో రోజు చేవెళ్ల స్థానానికి 19 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 56నామినేషన్లు దాఖలైనట్టు ఆర్వో శశాంక తెలిపారు. ఉదయం 11 నుంచి 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఇప్పటికే ఒకసెట్ నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తరఫున ఆయన ప్రతిపాదకుడు తోక అంజన్కుమార్ మరో రెండుసెట్లు దాఖలుచేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా మహ్మద్ అలీ, దాసరి సాహితి, అంకగళ్ల ప్రవీణ్కుమార్, మహ్మద్ ఎక్బాల్, కాతుల యాదయ్య, జి.మల్లేశంగౌడ్, జె.దుర్గప్రసాద్, ఎస్.గోపాల్, ఎం.సతీ్షసాగర్, ఎస్.శ్రీనివాస్ నామినేషన్ వేశారు. అంబేడ్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి తాహెర్కమల్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా చెంచురెడ్డి పద్మావతి నామినేషన్ వేశారు. యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ అభ్యర్థిగా సుంకె సంపత్, జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా సుగురు శ్రీనివాస్, దేశ్ జన్హిత్ పార్టీ అభ్యర్థిగా ఎండీ షకీల్, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పాని ప్రసాద్ కటకం, బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా పి.గోవింద్ నామినేషన్ వేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి బుధవారం 38నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి గౌతం తెలిపారు. రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి రోడ్షోగా తరలివచ్చి అంతాయపల్లి వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని లక్ష్మారెడ్డితో కలిసి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, వివేకానందలతో కలిసి లక్ష్మారెడ్డి నామినేషన్ వేశారు.
నేటితో ముగియనున్న నామినేషన్ పర్వం
రాజకీయ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపే వారు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. లోక్సభ స్థానాలకు నామినేషన్ల దాఖలుకు గురువారంతో గడువు ముగియనుంది. కాగా నేడు మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి ఇప్పటికే ఒకసెట్ నామినేషన్ జిల్లా ఎన్నికల అధికారి శశాంకకు దాఖలు చేశారు. నేడు ఆయన నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు.
చేవెళ్ల ఎంపీగా తెలుగు నటి నామినేషన్
రంగారెడ్డి అర్బన్ : పవర్స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని, నటి దాసరి సాహితి ఎన్నికల బరిలో దిగుతున్నారు. పొలిమేర, పొలిమేర-2 సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి సాహితి లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ స్థానం నుంచి బుధవారం స్వతంత్ర అభ్యతర్థిగా ఆమె నామినేషన్ దాఖలుచేశారు. నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశాంకు అందజేశారు. ‘విత్ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్’ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ నటించిన సర్కారు నౌకరీ సినిమాలోనూ సాహితి నటించారు. పొలిమేర సినిమాలో గెటప్ శ్రీను భార్యగా నటించిన సాహితి ’పొలిమేర-2లో సత్యం రాజేష్ సరసన నటించారు.