సేమ్ టు నేమ్!
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:05 AM
ఒకే పేరుతో ఇద్దరుంటే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో మనకు అనుభవమే. శ్రీను అనే పేరుతో ఇద్దరుంటే ఎవరిని ఎలా పిలవాలో తెలియక తికమక పడుతుంటాం.
చేవెళ్లలో ఇద్దరు విశ్వేశ్వర్రెడ్డిలు, రంజిత్రెడ్డిల నామినేషన్ దాఖలు
ఉపసంహరించుకుంటారా? లేక బరిలో ఉంటారా?
ఒకే పేరున్న వారితో గెలుపుపై ప్రభావం?
ప్రధాన పార్టీ అభ్యర్థుల గుండెల్లో గుబులు!
(ఆంధ్రజ్యోతి,రంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 27) : ఒకే పేరుతో ఇద్దరుంటే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో మనకు అనుభవమే. శ్రీను అనే పేరుతో ఇద్దరుంటే ఎవరిని ఎలా పిలవాలో తెలియక తికమక పడుతుంటాం. అందుకే చిన్న శ్రీను, పెద్ద శ్రీను అని ఏవో తగిలించి పిలుస్తుంటాం. కానీ.. ఎన్నికల్లో మాత్రం ఒకే పేరుతో ఒక్కరికి మించి అభ్యర్థులుంటే ఓటర్లు తికమక పడడం సహజం. కొన్నిసార్లు ఒకే పేర్లతో రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపుపైనా ప్రభావం చూపొచ్చు. డబుల్ పేర్లు ప్రధాన పార్టీ అభ్యర్థుల గుండల్లో గుబులు రేపుతోంది. ప్రత్యర్థులను దెబ్బకొట్టాలనే ఒకే పేరున్న వారితోస్వతంత్రులుగా నామినేషన్లు వేయిస్తుంటారు. ఈ నెల 18 నుంచి 25 వరకు చేవెళ్ల లోక్సభ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. 26న పరిశీలన పూర్తిచేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా 46మంది బరిలో ఉన్నారు. చేవెళ్ల మండలం ధర్మసాగర్కు చెందిన కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆల్ ఇండియా ఫార్వడ్ బ్లాక్ పార్టీ నుంచి కర్మన్ఘాట్కు చెందిన కొండా విశ్వేశ్వర్రెడ్డి నామినేషన్ వేశారు. డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయగా, ఇదే పేరుతో దుండిగల్కు చెందిన రంజిత్రెడ్డి గాదె రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ నుంచి నామినేషన్ వేశారు. విత్డ్రాకు ఈ నెల 29 తేదీ వరకు గడువుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి పేరుతో ఉన్న వారిని ఉపసంహించే విధంగా యత్నాలు చేస్తున్నట్లు సమచారం. సేమ్ నేమ్తో ఉన్న విశ్వేశ్వర్రెడ్డి, రంజిత్రెడ్డిలు నామినేషన్ ఉపసంహరించుకుంటారా? లేక బరిలో ఉంటారా? అనే విషయం త్వరలోనే తేలనుంది.