Share News

ఆ చిరుత చిక్కె.. మరో చిరుతొచ్చె!

ABN , Publish Date - May 04 , 2024 | 05:14 AM

గోడ దూకొచ్చి.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిధిలోని పచ్చిక ప్రాంతంలో తచ్చాడుతూ ఏడురోజులుగా అటవీ శాఖ, జీఎంఆర్‌ అధికారులను కనుకులేకుండా చేసిన చిరుత బోనుకు

ఆ చిరుత చిక్కె.. మరో చిరుతొచ్చె!

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ‘ఆపరేషన్‌ చిరుత’ సక్సెస్‌

మేక కోసం బోనులోకి.. వారం రోజుల ఉత్కంఠకు తెర

మెదక్‌ జిల్లా చేగుంట పరిసరాల్లో మరో చిరుత సంచారం

శంషాబాద్‌ రూరల్‌, హైదరాబాద్‌, చేగుంట, మే 3 (ఆంధ్రజ్యోతి): గోడ దూకొచ్చి.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిధిలోని పచ్చిక ప్రాంతంలో తచ్చాడుతూ ఏడురోజులుగా అటవీ శాఖ, జీఎంఆర్‌ అధికారులను కనుకులేకుండా చేసిన చిరుత బోనుకు చిక్కింది. ఏప్రిల్‌ 27న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని గొల్లపల్లి మీదుగా ఓ చిరుత పులి వచ్చి ఎయిర్‌పోర్టు గోడదూకి లోపలికి వచ్చింది. ఆ మృగం రన్‌వే మీదకు వెళ్లగా సైరన్‌ మోగడంతో అప్రమత్తమైన జీఎంఆర్‌ అధికారులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీ సిబ్బంది ఎయిర్‌పోర్టు పరిసరాల్లో మేక పిల్లలను ఎరగా ఓ ఐదు బోన్లు, 25 ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు రోజుల క్రితం చిరుత.. మేక పిల్లను చూసి ఓ బోనులోకి వెళ్తునట్టే వెళ్లి పక్కకు వెళ్లిపోయింది. ఎట్టకేలకు శుక్రవారం తెల్లవారుజామున రన్‌వేకు 2కి.మీ దూరంలోని ఓ బోనుకు చిక్కింది. దానికి మత్తు మందు ఇచ్చిన సిబ్బంది నెహ్రూ జూపార్కుకు తరలించారు. దాన్ని నల్లమల అడవుల్లో విడిచిపెడతామని చెప్పారు. చిరుత వయసు మూడేళ్లు అని.. ఆరోగ్యంగా ఉందని చెప్పారు. కాగా, మెదక్‌ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో మరో చిరుత సంచారం స్థానికులను కలవరపరుస్తోంది. అక్కడి సీసీ కెమెరాల్లో చిరుత సంచారాన్ని అటవీ సిబ్బంది గుర్తించినట్లు ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజ్‌ అధికారి నాగరాణి వెల్లడించారు. ఇబ్రహీంపూర్‌ రుక్మాపూర్‌, పులిమామిడి, బోనాల, గోవిందాపూర్‌, రాంపూ ర్‌, కన్యరం,, చిట్టోజిపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - May 04 , 2024 | 05:14 AM