సాహితీ హాలికుడు

ABN , First Publish Date - 2020-05-01T06:09:50+05:30 IST

సౌందర్య సస్యాన్ని సమృద్ధిగా పండించిన వెనుకటి తరం సాహితీ హాలికులలో శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు ఒకరు. వారి మరణం ఆధునికాంధ్ర సారస్వత లోకానికి తీరని లోటు, కవితా ప్రియులకు శోక కారణం...

సాహితీ హాలికుడు

తెలుగులో ‘రొమాంటిక్’ కవిత్వంపై ఆకర్షణ ప్రబలంగా వున్న రోజులలో రచన ప్రారంభించినా , కాటూరి వారి దృష్టి ఎక్కువగా జాతీయవాదం వైపు, ధార్మిక ప్రబోధం వైపు ప్రసరించింది. గాంధీ సిద్ధాంతాలతో ఆయన ఎక్కువగా ప్రభావితులయ్యారు.


సౌందర్య సస్యాన్ని సమృద్ధిగా పండించిన వెనుకటి తరం సాహితీ హాలికులలో శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు ఒకరు. వారి మరణం ఆధునికాంధ్ర సారస్వత లోకానికి తీరని లోటు, కవితా ప్రియులకు శోక కారణం.


మహాకవి లక్షణాలలో రచనా బాహుళ్యం ప్రధానమైనది కానేకాదు. రాశి కన్నా గుణం ప్రధానమైనది. పెక్కుమంది ఆధునికాంధ్ర కవుల వలెనే కాటూరి వారి కవితా రచనలు సంఖ్యలో కొద్దివైనా గుణ సమృద్ధమైనవి. 


చెళ్ళపిళ్ళ వారి వద్ద చేసిన శుశ్రూషా ప్రభావం వల్ల కావచ్చు, కాటూరివారి    కవితలో ప్రాచీనార్వాచీనతలు రెండూ సమ్మిళితమైనవి. వస్తువు కొత్తదైతే, పద్ధతి పాతది; పద్ధతి కొత్తదైతే, వస్తువు పాతది. కొత్త పాతల మేలుకలయికకు ఒక ఉదాహరణగా వారి కవిత్వం సాగింది. తెలుగులో ‘రొమాంటిక్’ కవిత్వంపై ఆకర్షణ ప్రబలంగా వున్న రోజులలో రచన ప్రారంభించినా, ఆయన దృష్టి ఎక్కువగా జాతీయవాదం వైపు, ధార్మిక ప్రబోధం వైపు ప్రసరించింది. గాంధీ సిద్ధాంతాలతో ఆయన ఎక్కువగా ప్రభావితులయ్యారు. 


గురువులైన తిరుపతి వెంకట కవుల వలె కాటూరి, పింగళి జంటకవులుగా కవితావ్యాసంగం ప్రారంభించారు. వారుభయులు రచించిన తొలకరి, సౌందర్యనందం ఆంధ్ర భాషకు అమూల్యాలంకారాలు. ఆ తరువాత కాటూరివారు విడిగా రచించిన ఖండకావ్యాల సంఖ్యలోనే స్వల్పమైనవి కాని, గుణంలో అస్వల్పమైనవి. అస్పృశ్యతా నిర్మూలనాన్ని ప్రబోధించే ‘గుడి గంటలు’ భక్తితత్వాన్ని ఆవిష్కరించే ‘పౌలస్త్య హృదయం’ మొదలైన ఖండ కావ్యాలు కాక భాస నాటకాలకు, కొన్ని సంస్కృతాంగ్ల కృతులకు అనువాదాలు, ఇతర నాటికలు, సంగీత రూపకాలు వారి ప్రతిభకు నిదర్శనాలు. 


కాటూరివారి వ్యాపకాలు బహుముఖమైనవి. కొన్నాళ్ళు కవిత్వం, కొన్నాళ్ళు కృష్ణాపత్రిక సంపాదకత్వం, మరి కొన్నాళ్ళు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యత్వం, హిందీ ప్రచారం, సాహిత్య సమావేశాలు, గోష్ఠులు, ఇటువంటివి మరెన్నో! ఏ వ్యాపకంలో వున్నా తమంతటి సహృదయులు, రసజ్ఞులు, స్నేహపాత్రులు మరి లేరనిపించుకొన్న ఉదాత్త వ్యక్తిత్వం ఆయనది.

(1962 డిసెంబర్ 27 ‘ఆంధ్రజ్యోతి’ 

సంపాదకీయం ‘శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు’ నుంచి)

Updated Date - 2020-05-01T06:09:50+05:30 IST