కన్నా లక్ష్మినారాయణకు మంత్రి బుగ్గన సవాల్
ABN , First Publish Date - 2020-05-01T22:59:52+05:30 IST
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.
అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కరోనా టెస్టింగ్ కిట్లను తాను సరఫరా చేసినట్లు చెప్పాడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. తనకు కంపెనీ ఉండి.. దాని ద్వారా కిట్లను సరఫరా చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కన్నా తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రేపు (శనివారం) ఉదయం 9 గంటలకు రాజీనామా చేస్తానని.. లేదా కన్నా తన పదవికి రాజీనామా చేస్తారా? అని బుగ్గన ప్రశ్నించారు. కన్నా తన వయసుకు, బాధ్యతకు తగిన విధంగా మాట్లాడాలని సూచించారు.
రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని, రాజకీయం చేయడానికి ఇంకా సమయం ఉందని, ఇలాంటి సమయంలో అందరం కలిసికట్టుగా కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేయాలని మంత్రి బుగ్గన పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం పరంగా ఏమైనా తప్పులు జరిగితే తగిన సలహాలు, సూచనలు చేయాలని, విమర్శలు చేయకూడదని అన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని రాజేంద్రనాథ్ మండిపడ్డారు.