ఆర్థికానికి చికిత్స ఎలా?
ABN , First Publish Date - 2020-05-01T05:45:39+05:30 IST
కోవిడ్-19తో చతికిలపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం పెద్ద ఎత్తున దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలని...
- ప్రధాని మోదీ కసరత్తు
- మంత్రులతో సమావేశం
- పెట్టుబడుల ఆకర్షణకు త్వరలో చర్యలు
న్యూఢిల్లీ: కోవిడ్-19తో చతికిలపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం పెద్ద ఎత్తున దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలని భావిస్తోంది. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ప్రధాని మోదీ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, ఉన్నతాధికార్లతో సమావేశమయ్యారు. చైనా నుంచి బయటికి వచ్చే ఎంఎన్సీలను ఆకర్షించేందుకు, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఇటీవల రాష్ట్రాల సీఎంలను కోరారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ప్రధాని ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించడం విశేషం.
ప్రస్తుతం ఉన్న పారిశ్రామికవాడలు, ఎస్టేట్లు, ప్లాట్లలో ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్దతిలో మౌలిక సదుపాయాలు కల్పించే అంశం ఈ సమావేశంలో చర్చించినట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఈ పద్దతిలో కంపెనీలు పెద్దగా కాలయాపన లేకుండా తమ యూనిట్లను ఈ ప్రాంతాల్లో వెంటనే ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, కంపెనీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని సానుకూల చర్యలు తీసుకోవాలని కూడా ప్రధాని మంత్రులు, అధికారులను ఆదేశించారు. గనులు, బొగ్గు రంగంలో మరిన్ని ఆర్థిక సంస్కరణలకు ఉన్న అవకాశాలపైనా ప్రధాని ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.