ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది
ABN , First Publish Date - 2020-12-04T08:58:36+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని, తక్షణమే జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి పార్లమెంటు సభ్యుడు సురేశ్ప్రభు
తక్షణమే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోండి
ప్రధాని మోదీకి ఎంపీ సురేశ్ ప్రభు వినతి
న్యూఢిల్లీ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని, తక్షణమే జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి పార్లమెంటు సభ్యుడు సురేశ్ప్రభు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి గురువారం లేఖ రాశారు. కార్పొరేషన్లకు చెందిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించడంతో ఆర్థికాభివృద్ధి, రాష్ట్ర పురోగతి క్రమక్రమంగా పతనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అపరిమితమైన అప్పులు తెచ్చి సంపద సృష్టించకుండా, సంక్షేమానికి ఖర్చు చేయడంతో రాబడి లేక ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎఫ్ఆర్బీఎం మార్గదర్శకాలను అనుసరించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతగా పేర్కొన్నారు.
ఏపీలో ఆర్థిక పరిస్థితి చేయిదాటకముందే జోక్యం చేసుకుని మార్గనిర్దేశం చేయాలని, రాష్ట్ర ప్రగతికి, పారిశ్రామిక వృద్ధికి, ఉద్యోగాల సృష్టికి సహకరించాలని కోరారు. కాగా, దేశ ఆర్థిక రంగంలో క్రమశిక్షణకు కట్టుబడి ఉంటూ, క్లిష్టమైన పరిస్థితులను, కొవిడ్ కారణంగా అనేక ఆర్థిక సవాళ్లను సాహసోపేతంగా ఎదుర్కొంటున్నప్పటికీ, జీడీపీ పుంజుకునేలా చర్యలు తీసుకోవడం పట్ల మోదీకి సురేశ్ ప్రభు అభినందనలు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు కూడా లేఖ రాసినట్లు వివరించారు.