పెళ్లివారితో వెళుతున్న ట్రాలీ బోల్తా... వరునితో పాటు ఆరుగురు మృతి
ABN , First Publish Date - 2020-12-04T13:15:58+05:30 IST
మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖండ్వా-బైతూల్ హైవేపై మెహ్లూ గ్రామం సమీపంలో...
ఖండ్వా: మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖండ్వా-బైతూల్ హైవేపై మెహ్లూ గ్రామం సమీపంలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి బృందంలోని వరునితో పాటు ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హర్సూద్, ఖాల్వాలలోని ఆసుపత్రులకు తరలించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన ట్రాక్టర్ ట్రాలీలో 35మంది పెళ్లివారు ఉన్నారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ట్రాక్టర్ ట్రాలీ బోల్తా కొట్టగానే దానిలోని వారంతా ట్రాలీ కింద చిక్కుకుపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు సంఘటనా స్థలానికి ఐదు అంబులెన్స్లు చేరుకున్నాయి. ఈ దుర్ఘటన గురించి తెలియగానే ఖండ్వా కలెక్టర్ ద్వివేది, ఎస్పీ వివేక్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెయిలింగ్ను ఢీకొని ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.