ఆర్టీసీ స్థలాలపై ‘అధికార’ కన్ను
ABN , First Publish Date - 2020-12-04T08:49:55+05:30 IST
రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు ఏవి అని అడిగితే వెంటనే గుర్తుకొచ్చేవి.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కర్నూలు.
ఖరీదైన ప్రాంతాల్లో ఆర్టీసీకి 1300 ఎకరాలు
ఈ స్థలాల విలువ వందల కోట్లలో.. లీజుల పేరుతో వాటిని దక్కించుకొనే ఎత్తు
బస్టాండ్ల అభివృద్ధి సాకుతో ప్రైవేటు పరం.. ఇప్పటికే సిద్ధమైపోయిన ప్రతిపాదనలు
ఐదేళ్లు ఉండే ప్రభుత్వం 33 ఏళ్లకు లీజు ఎలా ఇస్తుందని గతంలో ప్రశ్నించిన వైసీపీ
ఇప్పుడు ఏకంగా 50 ఏళ్లకు లీజు!.. ఓసారి ప్రైవేటుపరమైతే మళ్లీ వెనక్కి రావు
ఇందుకేనా ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపారు?.. కార్మిక సంఘాల ఆవేదన, మండిపాటు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు ఏవి అని అడిగితే వెంటనే గుర్తుకొచ్చేవి.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కర్నూలు. ఈ కీలక నగరాల నడిబొడ్డున ఏపీఎ్స ఆర్టీసీకి కోట్లాది రూపాయల విలువైన స్థలాలు ఉన్నాయి. అదికూడా వాణిజ్యానికి అన్నివిధాలా అనుకూలంగా అవి ఉన్నాయి. ఇంకేముంది.. అధికార పార్టీ నేతల కన్ను వాటిపై పడింది! సుదీర్ఘ లీజు పేరుతో ఈ స్థలాలకు చాపచుట్టే ప్రణాళిక సిద్ధమయిపోయింది. ఎక్కడైనా లీజు అంటే 33 ఏళ్లకే రాసుకొంటారు. అలాంటిది యాభై ఏళ్లకు అత్యంత విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చేలా ప్రభుత్వపెద్దలు పావులు కదుపుతున్నట్టు సమాచారం. బస్టాండ్లు, బస్ డిపోల స్థలాలను అభివృద్ధి చేసి..అదనపు ఆదాయం ఆర్జిస్తామని ఏపీఎ్సఆర్టీసీ అధికారులు పైకి చెబుతున్నా, దాని వెనుక కచ్చితంగా ఓ వర్గం దూరదృష్టి ఉందని పీటీడీ ఉద్యోగ సంఘాలు అనుమానపడుతున్నాయి.
రాష్ట్రంలో ఆర్టీసీకి 1300 ఎకరాల విస్తీర్ణంలో స్థలాలున్నాయి. విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఆరెకరాల స్థలాన్ని ఇప్పటికే సొంతం చేసుకునే ప్రక్రియ దాదాపు పూర్తయింది. తిరుపతి నడిబొడ్డున ఆర్టీసీకి ఉన్న 13 ఎకరాలు త్వరలో ప్రైవేటు పరం కానుంది. విజయవాడ ఆటోనగర్ బస్టాండుకు చెందిన రెండెకరాలు లీజు పేరుతో చేయి జారిపోతోంది. కర్నూలు రాజ్విహార్ ప్రాంతంలోని బస్టాండు స్థలం రెండెకరాలు ప్రైవేటు పరం కాబోతోంది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో 1.7 ఎకరాలు, గుంటూరు, నరసరావుపేట సహా రాష్ట్రంలోని మరిన్ని స్థలాలపై అధికార పార్టీ పెద్దలు కన్నేసినట్లు తెలుస్తోంది. ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెట్(ఏపీయూఐఎంఎల్) సంస్థకు ఖరీదైన ఆస్తులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అంతకుమించీ..
గత ప్రభుత్వం ఆర్టీసీ స్థలాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దేశంలో ఎక్కడైనా లీజులు ఇచ్చే విధానాన్ని పరిశీలిస్తే 33ఏళ్లకు వాటిని కేటాయిస్తారు. ఇదే విధానం చంద్రబాబు ప్రభుత్వం అనుసరించగా.. ఐదేళ్లు మాత్రమే ఉండే ప్రభుత్వం.. అంతకన్నా ఎక్కువ కాలానికి లీజు ఎలా ఇస్తుందని వైసీపీ నేతలు అప్పట్లో నిలదీశారు. కానీ అధికారంలోకి రాగానే అంతకుమించీ.. అన్నట్టు రాష్ట్రంలో 50 ఏళ్లకు ఆర్టీసీ స్థలాలను కట్టబెట్టేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం! అయితే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నడిబొడ్డున ఉండే అత్యంత ఖరీదైన స్థలాలు ఒక్కసారి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే ఇక వెనక్కిరావడం అసాధ్యమని పీటీడీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థలాలకు ప్రభుత్వమే యజమాని గనుక పీటీడీ ద్వారానే వాటిపై బ్యాంకుల్లో రుణాలు తీసుకుని అభివృద్ధి చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.
ప్రధాన నగరాల్లో ఎక్కడ.. ఎంత..?
- విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో
- రూ. 288 కోట్లు విలువైన ఆరెకరాలు
- తిరుపతిలో రూ. 910 కోట్లు విలువైన 13 ఎకరాలు
- కృష్ణాజిల్లాలోని హనుమాన్ జంక్షన్లో రూ. 50 కోట్లు విలువైన 1.7 ఎకరాలు
- విజయవాడలోని ఆటోనగర్లో రూ.48 కోట్లు విలువైన రెండెకరాలు
- కర్నూలులోని రాజ్ విహార్లో రూ. 100 కోట్లు విలువైన రెండెకరాలు
విలీనం ఇందుకేనా?
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనడంతో... కార్పొరేషన్లో కార్మికులకు మేలు జరిగి ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారని, అన్ని సౌకర్యాలు ఉంటాయని కార్మిక సంఘాల నేతలు భావించారు. ఏటా వెయ్యి కోట్ల చొప్పున మూడేళ్లు ప్రభుత్వం సాయం అందిస్తే పోయేదానికి ఇలా చేయడం ఏంటని మరికొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు పెదవి విరిచారు. కానీ ఏడు వేల కోట్ల రూపాయల అప్పున్న ఆర్టీసీకి డెబ్బైవేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. వాటిపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు ఒక్కొక్కటి తమ అనుయాయులకు స్వాధీన పరిచేందుకు రంగం సిద్ధం చేశారు.