స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-12-04T17:15:06+05:30 IST

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

అమరావతి: ప్రతిపక్షాలు శాసన ప్రవర్తించిన తీరును ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పుబట్టారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ సభ్యులు 4 రోజులుగా అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో వాళ్లు తమ వాదనలు వినిపించుకోవచ్చునని.. అయితే సభ నియమనిబంధనలకు లోబడి, సభ సంప్రదాయాలను పాటించాలని అన్నారు. అయితే ప్రతి రోజు సభ సజావుగా జరగకుండా కార్యక్రమాలకు అడ్డుతగులుతూ రభస చేయడం దురదృష్టకరమని అన్నారు. 


సభలో ప్రతిపక్ష సభ్యుల చర్యలు అత్యంత హేయమైనవని, దీనిపై శాసనసభాపతిగా ఎంతో బాధతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని తమ్మినేని చెప్పారు. సభకు సహకరించాలని, ఈ విధంగా చేయడం సరికాదని సూచించారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసిన రోజున మనసికంగా ఎంతో బాధపడతానని, నిద్ర కూడా పట్టదని చెప్పుకొచ్చారు. కానీ ప్రతిపక్షాలకు మాత్రం ఆ ఆలోచనే లేదని విచారం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం లేకనే సభ్యులను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.


సభను సజావుగా సాగించాలంటే ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో కొన్ని సవరణలు తీసుకురావాలని, ఇందుకు సభా నాయకుడు, సభ అనుమతించాలని స్పీకర్ తమ్మినేని అన్నారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇస్తే రాజకీయాలు మాట్లాడతారని, దీనిపై అధికారపక్షం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వార్తల్లో సమ భాగం రావాలని వారు కోరుకుంటున్నారని.. ప్రజలు మనల్ని గమనిస్తున్నారని.. సరైన సమయంలో నిర్ణయాలు ప్రకటిస్తారని సభాపతి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-12-04T17:15:06+05:30 IST