బోణీ కొట్టిన టీఆర్ఎస్.. రెండు స్థానాల్లో గెలుపు

ABN , First Publish Date - 2020-12-04T17:59:16+05:30 IST

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది.

బోణీ కొట్టిన టీఆర్ఎస్.. రెండు స్థానాల్లో గెలుపు

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మెట్టగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాసురి సునిత గెలుపొందారు. యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ ఘన విజయం సాధించారు. అయితే ఎంత మెజార్టీతో గెలుపొందారనే దానిపై అధికారికంగా ఎన్నికల అధికారులు ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం 21 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ-15 స్థానాల్లో, కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంలో మాత్రం ఆధిక్యంలో ఉంది. ఖైరతాబాద్, అమీర్‌పేట్, సనత్‌నగర్‌తో పాటు పలు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుకు దగ్గరలో ఉన్నారు. మరికొన్ని స్థానాల్లో బీజేపీ-టీఆర్ఎస్ పోటాపోటీగా ఉన్నాయి.


తొలి ఫలితం..

కాగా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. ఈయన గ్రేటర్ మాజీ మేయర్‌. కాగా.. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉండగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది. అయితే తొలి రౌండ్ ఫలితాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎంఐఎం మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం దరిదాపుల్లో కూడా లేవు.


Updated Date - 2020-12-04T17:59:16+05:30 IST