అడవిలో అడ్డగోలుగా!

ABN , First Publish Date - 2022-12-03T01:10:41+05:30 IST

అది మారుమూల అటవీ ప్రాంతం.. అలాంటి ప్రాంతంలో జరుగుతున్న పనులను ఎవరూ పట్టించుకోరనున్నారో లేక అధికారులు తనకు అన్ని రకాలుగా అండగా ఉన్నారనుకున్నారో తెలియదు గానీ ఓ కాంట్రాక్టరు నాణ్యతకు తిలోదకాలిచ్చాడు.

అడవిలో అడ్డగోలుగా!
పగుళ్లు వచ్చిన బీటీ నిర్మాణం, గతంలో సరిచేయిస్తామన్న పగులు

నాసిరకంగా ఆర్‌అండ్‌బీ రహదారి నిర్మాణం

పర్యవేక్షణ లేకుండా రాత్రివేళల్లో పనుల నిర్వహణ

నిబంధనల పేరుతో నాణ్యతకు పాతర

దుమ్ముగూడెం, డిసెంబరు 2: అది మారుమూల అటవీ ప్రాంతం.. అలాంటి ప్రాంతంలో జరుగుతున్న పనులను ఎవరూ పట్టించుకోరనున్నారో లేక అధికారులు తనకు అన్ని రకాలుగా అండగా ఉన్నారనుకున్నారో తెలియదు గానీ ఓ కాంట్రాక్టరు నాణ్యతకు తిలోదకాలిచ్చాడు. నాసిరకం పనులకు తెగబడ్డాడు. ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లేకుండా రెండు రాత్రుల్లో రహదారి పనులు అడ్డగోలుగా పూర్తిచేసి చేతులు దులుపుకొన్నాడు. పర్యవేక్షించాల్సిన ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్‌ అధికారులు కూడా ‘నిర్మాణం-నిర్వహణ’ నిబంధనల పేరుతో వారి బాధ్యతలను పక్కన బెట్టి కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో పనులు ఎలా చేసినా ఏమీ కాదనే ధోరణిలో ఏజెన్సీలోని పలు రహదారుల నిర్మాణాలు అక్రమాలకు నెలవుగా మారాయన్న విమర్శలున్నాయి.

నాసిరకంగా రహదారి నిర్మాణం

దుమ్ముగూడెం మండలం చింతగుప్ప-దబ్బనూతల మార్గంలో సుమారు కిలోమీటరు పాటు ఆర్‌అండ్‌బీ రహదారిని రెండు రోజుల క్రితం నిర్మించారు. రోలింగ్‌ సక్రమంగా చేయకపోవడంతో పాటు, నిబంధనల ప్రకారం అవసరమైన బీటీ వేయకపోవడంతో రహదారిపై అప్పుడే పగుళ్లు వచ్చాయి. రహదారి నిర్మాణంపై పలు చోట్ల కేవలం కాలితో తంతే బీటీ మిక్స్‌ పైకి లేచిపోయే పరిస్థితి కనబడుతోంది. జూన్‌ నెలలో మొదటి లేయరు వేయగా, తాజాగా రెండో లేయర్‌ అద్వానంగా వేసి పనులు పూర్తి చేశారు. రెండు రోజులపాటు రాత్రి వేళలో కేవలం ఐదు టిప్పర్ల బీటీ పరిచి మమ అనిపించారు. గతంలో వేసిన మొదటి లేయరు మీద కొన్ని చోట్ల అంగుళం మందం కూడా బీటీ కనబడకపోవడం గమనార్హం. అలాగే రహదారికిరువైపులా ఉన్న పచ్చగడ్డిని సైతం తొలగించకుండా దానిపైనే బీటీ వేయడం దారుణమని స్థానిక ఆదివాసీలు వాపోతున్నారు.

గత నిర్మాణాల తీరు కూడా ఇలాగే

ఈ ఏడాది జూన్‌లో ఆర్‌అండ్‌బీ శాఖ ఆద్వర్యంలో 6కోట్ల పీఎంజీఎ్‌సవై నిధులతో చింతగుప్ప వంతెనతో పాటు బీటీ అప్రోచ్‌రోడ్డు నిర్మించారు. నిర్మించిన కొద్దిరోజులకే అప్రోచ్‌ రోడ్డు రెండుచోట్ల పది అడుగుల పొడవున బీటలు వారిన వైనంపై జూలై 3న ‘ఆంధ్రజ్యోతి’లో ‘నాణ్యత నేతిబీర’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. సీఈ సతీష్‌ పర్యవేక్షణ సందర్భంగా పగుళ్లను కాంట్రాక్టరు ఇసుకతో కప్పి మసిపూసి మారేడు కాయ చేశారన్న విషయాన్ని ఫొటోలతో సహా వివరించింది. నిబంధనల ప్రకారం బీటలు వారిన ప్రాంతంలో కాంట్రాక్టరుతో మరమతులు చేయిస్తామని వివరణ ఇచ్చిన ఈఈ భీమ్లానాయక్‌ దాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. ఆరు నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ రహదారిపై ఆ పగుళ్లు అలాగే ఉండడం గమనార్హం. దీంతో రహదారుల నిర్మాణ అనంతరం కొన్నేళ్లపాటు నిర్వాహణ అనే నిబంధన కేవలం కాగితాలకే తప్ప క్షేత్రస్థాయిలో ఉండడం లేదన్న సంఘటనకు ఇదే ఉదాహరణగా కనబడుతోంది.

ఏఈ రాంబాబు ఏమన్నారంటే..

రహదారి నిర్మాణం జరిగిన సమయంలో తాను హైదరాబాద్‌ వెళ్లానని, ఈనెల 3న రహదారి నిర్మాణాన్ని పరిశీలిస్తానని ఏఈ రాంబాబు తెలిపారు. పనులు నాసిరకంగా ఉంటే పూర్తిగా తొలగించి మళ్లీ చేయిస్తామన్నారు. ఈ విషయమై డీఈని సంప్రదించాలని ఆయన సూచించగా.. ‘ఆంధ్రజ్యోతి’ డీఈ హరిలాల్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఏఈ రాంబాబు నుంచి వివరాలు అడిగి తెలుసుకోవాలని డీఈ తెలిపారు.

Updated Date - 2022-12-03T01:10:42+05:30 IST