Share News

Mumbai Actress Kadambari Jethwani : న్యాయం చేయండి

ABN , Publish Date - Sep 20 , 2024 | 04:36 AM

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ తనపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని ముంబై నటి కాదంబరి జెత్వానీ హోం మంత్రి అనితను కోరారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విన్నవించారు.

Mumbai Actress Kadambari Jethwani : న్యాయం చేయండి

  • నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించండి

  • విద్యాసాగర్‌ పెట్టిన అక్రమ కేసు ఎత్తేయండి

  • హోం మంత్రి అనితకు నటి జెత్వానీ వినతి

అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ తనపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని ముంబై నటి కాదంబరి జెత్వానీ హోం మంత్రి అనితను కోరారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విన్నవించారు. గురువారం అమరావతి సచివాలయంలో హోం మంత్రితో ఆమె భేటీ అయ్యారు. గత ంలో తనను అక్రమ కేసులో అరెస్టు చేసి మానసిక వేధింపులకు గురి చేసినందుకు తనకు ప్రభుత్వం పరిహారం ఇప్పించాలని కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన తల్లిదండ్రులు, న్యాయవాదితో హోం మంత్రిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరినట్లు చెప్పారు. కాగా, హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ... జెత్వానీ ఐ ఫోన్లను రెండు సార్లు అనధికారికంగా ఓపెన్‌ చేయాలని చూశారన్నారు. జెత్వానీ మీద కేసును విత్‌డ్రా చేసుకుంటే ఆమె మీద పడిన మచ్చ పోతుందన్నారు.

  • కేసులో ఎవరున్నా శిక్షపడేలా చేస్తాం: అనిత

జెత్వానీ కేసులో ఎంతటి వారున్నా శిక్షపడేలా చేస్తామని హోంమంత్రి అనిత అన్నారు. సచివాలయంలో కుటుంబ సభ్యులతో సహా తనను కలిసిన జెత్వానీకి మంత్రి ధైర్యం చెప్పారు. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. అందుకు ప్రభుత్వం, హోంమంత్రికి జెత్వానీ కృతజ్ఞతలు తెలిపారు. కేసు ముగిసే వరకూ విజయవాడలో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలని వినతి పత్రం అందజేశారు.

Updated Date - Sep 20 , 2024 | 04:36 AM