Share News

Flipkart: మరో ఫౌండర్ కూడా దూరం.. ఫ్లిప్‌కార్ట్ బోర్డ్‌కు బిన్నీ బన్సల్ రాజీనామా!..!

ABN , Publish Date - Jan 27 , 2024 | 09:07 PM

భారత్ ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న ఫ్లిప్‌కార్ట్‌ బోర్డుకు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ రాజీనామా చేశారు. 2007లో సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ కలిసి బెంగళూరులో ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించి ఎంతో అభివృద్ధి చేశారు.

Flipkart: మరో ఫౌండర్ కూడా దూరం.. ఫ్లిప్‌కార్ట్ బోర్డ్‌కు బిన్నీ బన్సల్ రాజీనామా!..!

భారత్ ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) బోర్డుకు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ (Binny Bansal) రాజీనామా చేశారు. 2007లో సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ కలిసి బెంగళూరులో ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించి ఎంతో అభివృద్ధి చేశారు. అమెజాన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థతో పోటీపడి భారత్‌లో ఫ్లిప్‌కార్ట్‌ను అగ్రగామిగా నిలిపారు. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 16 బిలియన్ డాలర్లకు (రూ.1.3 లక్షల కోట్లు) అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ (Walmart) 2018లో కొనుగోలు చేసింది.

ఆ సమయంలో డీల్‌లో భాగంగా కంపెనీ నుంచి సచిన్ బన్సల్ (Sachin Bansal) తప్పుకున్నారు. బిన్నీ బన్సల్ మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగారు. ఈ నెల 2వ తేదీన ``ఆప్‌డోర్`` (OppDoor) అనే కొత్త స్టార్టప్‌ను బిన్నీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ-కామర్స్ బిజినెస్‌ల అభివృద్ధి, విస్తరణ మొదలైన వాటికి ఈ సంస్థ సహకరిస్తుంది. ఈ కంపెనీని ప్రారంభించిన నాటి నుంచే ఫ్లిప్‌కార్ట్‌ బోర్డ్ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. దీంతో వారం క్రితమే బిన్నీ తన రాజీనామాను (Binny Bansal Resignation) సమర్పించారని సమాచారం.

ఫ్లిప్‌కార్ట్‌లో తనకు మిగిలిన వాటాను కూడా బిన్నీ బన్సల్.. వాల్‌మార్ట్‌కు అమ్మేసినట్టు తెలుస్తోంది. కాగా, గత 16 ఏళ్లుగా ఫ్లిప్‌కార్ట్ సంస్థ సాధించిన విజయాల పట్ల గర్వపడుతున్నట్టు బిన్నీ బన్సల్ చెప్పారు. సంస్థ ప్రస్తుతం సమర్థులైన వ్యక్తుల చేతుల్లోనే ఉందని, ఇక ముందు కూడా ఇదే జోష్‌ను సంస్థ ప్రదర్శించాలని బిన్నీ ఆకాంక్షించారు.

Updated Date - Jan 27 , 2024 | 09:10 PM