Share News

Paralympics : లక్ష్యాన్ని ఛేదించి బలమైన శక్తిగా ఎదిగి..

ABN , Publish Date - Sep 09 , 2024 | 04:56 AM

పది రోజులకుపైగా క్రీడాభిమానులను అలరించిన పారాలింపిక్స్‌కు ఆదివారంతో తెరపడింది. ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు నిర్దేశించుకున్న 25 పతకాల లక్ష్యాన్ని అలవోకగా దాటేశారు. టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలతో అదరగొట్టడం ఈసారి క్రీడల్లో మనం 25కిపైగా మెడల్స్‌ సాధిస్తామనే లక్ష్యాన్ని నిర్దేశించుకొనేందుకు ప్రేరణ అయ్యింది. పారి్‌సలో మొత్తం 29 పతకాలు

Paralympics : లక్ష్యాన్ని ఛేదించి బలమైన శక్తిగా ఎదిగి..

పారాలింపిక్స్‌

29 పతకాలతో భారత్‌ ఘనమైన ముగింపు

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

పది రోజులకుపైగా క్రీడాభిమానులను అలరించిన పారాలింపిక్స్‌కు ఆదివారంతో తెరపడింది. ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు నిర్దేశించుకున్న 25 పతకాల లక్ష్యాన్ని అలవోకగా దాటేశారు. టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలతో అదరగొట్టడం ఈసారి క్రీడల్లో మనం 25కిపైగా మెడల్స్‌ సాధిస్తామనే లక్ష్యాన్ని నిర్దేశించుకొనేందుకు ప్రేరణ అయ్యింది. పారి్‌సలో మొత్తం 29 పతకాలు (7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు) సొంతం చేసుకున్న భారత్‌ భవిష్యత్‌లో ఈ క్రీడల్లో బలమైన శక్తిగా ఎదుగుతున్నామని నిరూపించింది. ఇక..ఈసారి మన పతకాల్లో ఏకంగా ఏడు స్వర్ణాలుండడం రికార్డు. 29 పతకాల్లో..ట్రాక్‌, ఫీల్డ్‌ విభాగంలోనే 17 రావడం ఇంకో విశేషం. చైనా 200పైగా మెడల్స్‌తో అగ్రస్థానంలో నిలవగా..భారత్‌ 18వ స్థానానికి దూసుకొచ్చింది.

అదిరే ప్రదర్శన..: 84 మంది భారత బృందంలో పలువురు అథ్లెట్లు చారిత్రక ప్రదర్శనతో పతకాలు పట్టేశారు. మహిళల 100మీ., 200మీ. స్ర్పింట్‌ టీ35 విభాగాలలో ప్రీతిపాల్‌ రెండు కాంస్యాలు చేజిక్కించుకుంది. పురుషుల జూడో 60కిలోల జే1 కేటగిరీలో కపిల్‌ పర్మార్‌ కూడా కాంస్యం దక్కించుకున్నాడు. ఆర్చర్‌లో హ ర్విందర్‌, క్లబ్‌ త్రోలో ధరమ్‌బీర్‌ పసిడి పతకాలతో ఔరా అనిపించారు. మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో కాంస్యం కైవసం చేసుకున్న చేతులులేని ఆర్చర్‌ శీతల్‌ దేవి ప్రతిభకు పారిస్‌ ఫిదా అయ్యింది. జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌, షూటర్‌ అవనీ లేఖారా తమ స్వర్ణ పతకాలను నిలబెట్టుకొని ‘ఫేవరెట్‌’ టైటిల్‌కు సార్థకత చేకూర్చారు.

భళా దీప్తి: పారాలింపిక్స్‌లో తలపడిన తెలుగు అథ్లెట్లలో రవి (షాట్‌పుట్‌), అర్షద్‌ (సైక్లింగ్‌), నారాయణ (రోయింగ్‌) నిరాశ పరచగా.., దీప్తి జీవాంజి మాత్రమే అంచనాలను అందుకుంది. మహిళల 400 మీటర్ల టీ20 పరుగులో ఆమె కాంస్య పతకంతో మెరిసింది.


simran-sharma.jpg

సిమ్రన్‌.. బెస్ట్ టైమింగ్‌

మహిళల 200 మీటర్ల (టీ12)లో వరల్డ్‌ చాంపియన్‌ సిమ్రన్‌ 24.75 సెకన్ల అత్యుత్తమ సమయంతో రేస్‌ను పూర్తిచేసి కాంస్య పతకం చేజిక్కించుకుంది. దృష్టిలోపం ఉన్న రన్నర్లు పాల్గొనే ఈ రేస్‌లో..అథ్లెట్ల గైడ్‌ కూడా పరుగులో పాల్గొంటారు. దాంతో గైడ్‌గా అభయ్‌సింగ్‌ పరిగెత్తాడు. డ్యురాండ్‌ (క్యూబా, 23.62సె.) స్వర్ణం, పెరెజ్‌ లోపెజ్‌ (వెనిజూలా, 24.19సె.) రజతాలు నెగ్గారు.

షాట్‌పుట్‌లో సెమా కంచు మోత: శుక్రవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల షాట్‌పుట్‌లో భారత అథ్లెట్‌ హొకటో హొటొజె సెమా కాంస్య పతకం సాధించాడు. నాగాలాండ్‌కు చెందిన ఈ మాజీ సైనికుడు ఫైనల్స్‌లో ఇనుప గుండును 14.65 మీటర్లు దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. ఇరాన్‌ అథ్లెట్‌ యాసిన్‌ (15.96 మీ.)కు స్వర్ణం, బ్రెజిల్‌కు చెందిన తియాగో (15.06మీ.)కు రజతాలు దక్కాయి.

నవ్‌దీప్‌కు స్వర్ణం సిమ్రన్‌కు కాంస్యం

పారిస్‌: తమ జోరు కొనసాగిస్తూ పారాలింపిక్స్‌ చివర్లోనూ భారత అథ్లెట్లు పతకాలు కొల్లగొట్టారు. శనివారంనాటి పోటీలలో రెండు పతకాలు సాధించారు. పురుషుల జావెలిన్‌ ఎఫ్‌41 విభాగంలో నవ్‌దీప్‌ సింగ్‌ స్వర్ణ పతకం సొంతం చేసుకోగా, మహిళల 200 మీటర్ల (టీ12) రేసులో సిమ్రన్‌ కాంస్యం చేజిక్కించుంది. వాస్తవంగా 47.32 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నవ్‌దీ్‌ప..చైనాకు చెందిన ప్రపంచ రికార్డు హోల్డర్‌ సన్‌ పెంగ్‌ జియాంగ్‌ను వెనక్కు నెట్టి రజత పతకం అందుకున్నాడు. కానీ స్వర్ణం నెగ్గిన ఇరాన్‌ జావెలిన్‌ త్రోయర్‌ (47.64మీ.) అరబిక్‌ అక్షరాలతో కూడిన నల్లజెండాను ప్రదర్శించడంతో అతడిపై వేటు వేశారు. ఫలితంగా నవ్‌దీ్‌పకు పసిడి పతకం దక్కింది. అంతకుముందు కాంస్యంతో సరిపెట్టుకున్న పెంగ్‌ (44.72మీ.)కు రజతం ప్రకటించారు. నుఖేలావీ (ఇరాక్‌, 40.46మీ.) కాంస్యం లభించింది.

Updated Date - Sep 09 , 2024 | 04:56 AM