Share News

Liquor: మద్యం కొత్త బ్రాండ్లకు బ్రేక్‌

ABN , Publish Date - Jun 13 , 2024 | 05:14 AM

రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్‌ పడింది. ఐదు కంపెనీలకు ఇటీవలే ఇచ్చిన అనుమతులను రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నిలిపివేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం నిర్ణయం

Liquor: మద్యం కొత్త బ్రాండ్లకు బ్రేక్‌

  • 5 కంపెనీలకు అనుమతుల నిలిపివేత..

  • సీఎం రేవంత్‌ నిర్ణయం

  • త్వరలో కొత్త మద్యం విధానంపై కీలక భేటీ

హైదరాబాద్‌, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్‌ పడింది. ఐదు కంపెనీలకు ఇటీవలే ఇచ్చిన అనుమతులను రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నిలిపివేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం నిర్ణయం తీసుకున్నారు. సోమ్‌ డిస్టిలరీ్‌సతో పాటు కర్ణాటకకు చెందిన టోయిట్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన మౌంట్‌ ఎవరెస్ట్‌, హైదరాబాద్‌కు చెందిన ఎక్సాటికాతోపాటు మరో కంపెనీకి కూడా రాష్ట్రంలో బీర్ల సరఫరాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ వేసవిలో తీవ్రమైన బీర్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతీ ఏటా వేసవిలో డిమాండ్‌ అధికంగా ఉంటుందని తెలిసీ.. దానికి అనుగుణంగా ఈసారి సరఫరా జరగలేదు. కొత్త మద్యం బ్రాండ్లను తెచ్చేందుకే కృత్రిమ కొరత సృష్టించారన్న ఆరోపణలు వచ్చాయి.

మరోవైపు అనుమతులు పొందిన కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఐదు మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు అనుమతులను నిలిపివేస్తున్నట్టు ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. అయితే మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్‌ శాఖ నుంచి భారీగా ఆదాయాన్ని ఆశిస్తున్న ప్రభుత్వం.. నూతన మద్యం విధానాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై కీలక సమావేశం ముఖ్యమంత్రి నేతృత్వంలో త్వరలో నిర్వహించనున్నట్టు తెలిసింది.

Updated Date - Jun 13 , 2024 | 09:19 AM