Share News

Telangana: రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైన తెలంగాణ హెడ్ కానిస్టేబుల్..

ABN , Publish Date - Aug 14 , 2024 | 07:14 PM

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 1,037 మంది పోలీసు సిబ్బంది, అగ్నిమాపక దళ సభ్యులు, హోంగార్డులు తదితరుల పేర్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.

Telangana: రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైన తెలంగాణ హెడ్ కానిస్టేబుల్..

ఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 1,037 మంది పోలీసు సిబ్బంది, అగ్నిమాపక దళ సభ్యులు, హోంగార్డులు తదితరుల పేర్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. 2022లో ఇద్దరు నేరస్థులను పట్టుకోవడానికి ప్రాణాలను అడ్డుపెట్టిన తెలంగాణ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అత్యున్నత పురస్కారం ప్రకటించింది కేంద్రం. ఆయనకు రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకాన్ని ప్రదానం చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.


213 మందికి మెడల్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చదువు యాదయ్యతో పాటు 213 మంది సిబ్బందికి మెడల్ ఆఫ్ గ్యాలంటరీ(జీఎం) ప్రదానం చేయనున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి గరిష్ఠంగా 52 శౌర్య పతకాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులకు 31, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 17 మంది పోలీసు సిబ్బంది, ఛత్తీస్‌గఢ్ నుండి 15, మధ్యప్రదేశ్ నుండి 12 మందికి పతకాలు వరించాయి. రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం అత్యున్నతమైనది కావడంతో.. ఈ పతకం వచ్చిన చదువు యాదయ్య పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది.


ప్రాణాలు అడ్డుపెట్టి.. నిందితులను పట్టుకొని..

ఓ చోరీ కేసులో 2022లో తెలంగాణ పోలీసు శాఖలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ యాదయ్య ధైర్య సాహసాలు ప్రదర్శించారు. చోరీ కేసులో నిందితులైన ఇషాన్ నిరంజన్ నీలంనల్లి, రాహుల్‌ను ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో నిరంజన్, రాహుల్.. యాదయ్యపై కత్తితో దాడికి దిగారు. ఓ వైపు తీవ్ర రక్తస్రావం అవుతున్నా.. యాదయ్య వారితో పోరాడారు. చివరికి వారిని బంధించారు. ఈ ఘటనలో ఆయన గాయపడి 17 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రాణాలను లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడిన యాదయ్య ధైర్యసాహసాలకు గుర్తింపుగా కేంద్రం రాష్ట్రపతి గ్యాలంటరీ పురస్కారాన్ని ప్రకటించింది.


అభినందించిన డీజీపీ..

రాష్ట్రపతి గ్యాలంటరీ పతకానికి ఎంపికైన సందర్భంగా యాదయ్యను రాష్ట్ర డీజీపీ జితేందర్ సన్మానించారు. ఆయన తెలంగాణకు గర్వకారణమంటూ డీజీపీ కొనియాడారు. పతకం రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 14 , 2024 | 07:29 PM