Yogi Adityanath: తిరుమల పర్యటనకు రండి
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:24 AM
తిరుమల శ్రీవారిని దర్శించుకుని, ధర్మవరం పట్టు ప్రత్యేకతను చూడాల్సిందిగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఆహ్వానించారు. దీనికి యోగి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
యూపీ సీఎంకు మంత్రి సత్యకుమార్ ఆహ్వానం
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ఏపీలోని తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకుని, ధర్మవరం నియోజకవర్గాన్ని సందర్శించాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఆహ్వానించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు. సోమవారం లఖ్నవూ వెళ్లిన సత్యకుమార్.. యోగిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ధర్మవరం పట్టు వస్త్రం, నిమ్మలకుంట కళాకారులు రూపొందించిన శ్రీకృష్ణుని తొలుబొమ్మను బహూకరించారు. ధర్మవరం పట్టు, నిమ్మలకుంట తోలుబొమ్మల విశిష్టతను వివరించారు. సీఎం యోగి కూడా మంత్రి సత్యకుమార్కు మధుర శ్రీకృష్ణుడి ప్రతిమను బహూకరించారు. యోగితో దేశ, రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించినట్లు మంత్రి సత్యకుమార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.