వేసవిలో తాగునీటి పథకాలకు సమస్య లేదు
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:58 AM
వేసవిలో ఎండల మండిపోతున్నాయి. రెండు, మూడు రోజులుగా 42 డిగ్రీల ఎండ నమోదు అవుతుంది.
ఫ గాజులదిన్నె ప్రాజెక్టులో 1.2 టీఎంసీల నీరు
ఫ రోజుకు 30 నుంచి 35 క్యూసెక్కుల నీరు ఆవిరి
గోనెగండ్ల, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): వేసవిలో ఎండల మండిపోతున్నాయి. రెండు, మూడు రోజులుగా 42 డిగ్రీల ఎండ నమోదు అవుతుంది. అయితే గాజులదిన్నె ప్రాజెక్టు లో ప్రస్తుతం 1.2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అయితే అధికారులు మాత్రం ఈ వేసవిలో ప్రాజెక్టు కింద ఉన్న తాగునీటి పథకాలకు నీటి సమస్య లేదని జీడీపీ ఇరిగేషన అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం జీడీపీలో నీటి మట్టం 2.0(గ్రాస్), (1.2లైవ్)టీఎంసీల నీరు ఉన్నట్లు తెలుస్తుంది. మండువేసవిలో ఈ స్థాయిలో నీటి నిలువ ఉండటవంతో జీడీపీ తాగునీటి పథకాలకు నీటి కొరత లేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎండలు పెరిగే కొద్ది ప్రాజెక్టు నీరు ఆవిరి రూపంలో రోజుకు 30 నుంచి 35 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతున్నట్లు తెలుస్తుంది. మేలో ఎండతీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో జూన, జూలై నెలలో వర్షాలు కురిసి ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరేవరకు తాగునీటి పథకాలకు ఇబ్బంది ఉంటుందా లేదా అన్నది స్పష్టంగా చెప్పడానికి వీలు కావడం లేదు అన్నది వాస్తవం. గాజులదిన్నె ప్రాజెక్టు కింద బండగట్టు, డోన, క్రిష్టగిరి నీటి పథకాల కింద దాదాపు 120 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. అయితే అవసర సమయంలో కర్నూలు, కోడుమూరు, గూడురు, బెళగల్, నగరాలకు తాగునీటి కోసం అధిక నీటిని తరలిస్తే కొంత ఇబ్బందిగా మారచ్చని తెలుస్తుంది.