Greyhounds training centre: రెల్లిలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి 516 ఎకరాలు
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:23 AM
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు 516.58 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీనిలో కొంతభాగం ప్రజల సాగులో ఉండగా, వారికి భూమి ప్రత్యామ్నాయం, నష్ట పరిహారం అందజేయనున్నట్లు కలెక్టర్ నివేదిక ఇచ్చారు.
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి 516.58 ఎకరాల భూమి కేటాయిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి గురువారం ఉత్తర్వులు (జీఓ-123) జారీచేశారు. గతంలో విశాఖ జిల్లా ఆనందపురం మండలం జగన్నాధపురంలో గ్రేహౌండ్స్ కోసం భూమి కేటాయించారు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. తాజా భూ కేటాయింపుపై కలెక్టర్ నుంచి ప్రతిపాదన తెప్పించుకొని ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీలో చర్చించారు. ఎకరానికి రూ.27 లక్షల చొప్పున రూ.139.47 కోట్లకు భూమిని కేటాయించాలని తీర్మానించారు. ఈ ప్రతిపాదనను రెవెన్యూ శాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులిచ్చింది. మొత్తం భూమిలో 337.45 ఎకరాలే ప్రభుత్వ భూమి. మిగిలిన 179.13 ఎకరాలు ప్రజల సాగులో ఉన్నాయి. ఈ భూముల్లో పొజిషన్లో ఉన్న రైతులకు మరో చోట భూములు కేటాయిస్తామని విజయనగరం కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. ఈ భూమిలోనే 5.34 ఎకరాలకు పరిహారంగా రూ.1.44 కోట్లు అందించాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు.