Minister Narayana: ముగిసిన మంత్రి నారాయణ గుజరాత్ పర్యటన
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:27 AM
గుజరాత్లోని జిందాల్ ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, నరేంద్రమోదీ స్టేడియాలను మంత్రి నారాయణ పరిశీలించారు. అమరావతిలో నిర్మించనున్న స్పోర్ట్స్ సిటీ కోసం సాంకేతిక విశ్లేషణ చేసేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): మంత్రి నారాయణ బృందం రెండు రోజుల గుజరాత్ పర్యటన ముగిసింది. రెండో రోజు గుజరాత్లో పర్యటించిన ఆయన ఉదయం గ్యాస్పూర్లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను సందర్శించారు. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్, పేవర్ బ్లాక్స్ తయారుచేసే విధానాన్ని మంత్రి, అధికారులు పరిశీలించారు. ప్రతి రోజూ పెద్దఎత్తున వస్తున్న ఘనవ్యర్థాలను డీకంపోజ్ చేసే విధానాన్ని అధికారులు వివరించారు. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంను మంత్రి నారాయణ పరిశీలించారు. కేవలం 9 నెలల్లోనే స్టేడియంను నిర్మించిన విధానాన్ని గుజరాత్ క్రీడల శాఖ అధికారులు వివరించారు. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం భారీ క్రికెట్ స్టేడియంను నిర్మించనుంది. అహ్మదాబాద్ పర్యటన తర్వాత విజయవాడకు మంత్రి నారాయణ, అధికారులు బయలుదేరి వచ్చారు.