YSR Congress Party: రాష్ట్రంలో ‘గ్లాడియేటర్’ పాలన
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:54 AM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘గ్లాడియేటర్ పాలన’ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చంద్రబాబు కుట్రలు, పన్నాగాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
‘ఒక’ మనిషిని ఇరికించేందుకు దొంగ సాక్ష్యాల సృష్టి
సీనియర్ ఐపీఎస్ పీఎ్సఆర్ అరెస్టు పరాకాష్ఠ: పీఏసీలో జగన్
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో ‘గ్లాడియేటర్’ పాలన సాగుతోంది. చరిత్రలో తొలిసారి ‘ఒక’ మనిషిని ఇబ్బంది పెట్టేందుకు, ఇరికించేందుకు దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ్సఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడం దానికి పరాకాష్ఠ’’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జగన్ అధ్యక్షతన ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ మాట్లాడారు. ‘‘కూటమి వైసీపీ మీద బురద జల్లుతోంది. దుర్మార్గంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. రోమన్ రాజుల కాలంలో గ్యాలరీల్లో ప్రజలను పెట్టి, బరిలోకి గ్లాడియేటర్లను(మల్లయోధులు) వదిలి మనుషులను చంపుకునే పోటీలను పెట్టేవారు. వినోదం పేరుతో రోజుకో దుర్మార్గమైన ఆట పెట్టి, ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. అదే తరహాలో ఏదైనా ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్య బయటకు వచ్చిందంటే వెంటనే చంద్రబాబు డైవర్ట్ చేస్తున్నాడు. ఏమీ లేకపోతే నామీద ఎవరో ఒకర్ని తీసుకువచ్చి మాట్లాడిస్తున్నారు.
లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక భయాన్ని సృష్టించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒక మనిషిని ఇరికించేందుకు అనేకమందిని భయపెడుతున్నారు, ప్రలోభపెడుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. ఈ రాష్ట్రం ఎటువెళ్తుందో ఆర్థం కావడంలేదు. కేసులకు భయపడటం లేదు. కేసులు పెట్టి జైలుకు పంపించినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికమే. ప్రజలకు చేసిన మంచి ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. చంద్రబాబుపై వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తోంది. కాని, వైసీపీకి మీడియా సపోర్టు లేదు. వైసీపీ యుద్ధ వాతారణంలో పుట్టింది. రానున్న ఆరు నెలల్లో సంస్థాగతంగా కమిటీలను వేస్తాం. పార్టీకి దిశానిర్దేశం చేస్తాం’ అని జగన్ అన్నారు.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..