Share News

భారతీయతకు విశ్వగౌరవం

ABN , Publish Date - Apr 20 , 2025 | 03:31 AM

భారతదేశం భౌగోళికంగా ఒక దేశమే కావొచ్చు. కానీ ఇది అనేక సంస్కృతుల, భాషల, సంప్రదాయాల సమ్మేళనం. మన దేశ చరిత్ర చూసినప్పుడు, వేలాది సంవత్సరాల నాటి జ్ఞాన సంపద, తత్త్వ సారాలు కనిపిస్తాయి....

భారతీయతకు విశ్వగౌరవం

భారతదేశం భౌగోళికంగా ఒక దేశమే కావొచ్చు. కానీ ఇది అనేక సంస్కృతుల, భాషల, సంప్రదాయాల సమ్మేళనం. మన దేశ చరిత్ర చూసినప్పుడు, వేలాది సంవత్సరాల నాటి జ్ఞాన సంపద, తత్త్వ సారాలు కనిపిస్తాయి. మనం చెప్పుకునే రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, నాట్యశాస్త్రం, భగవద్గీత వంటి గ్రంథాలు కేవలం మతపరమైన రచనలు కావు. అవి జీవన పాఠాలు. భారతీయత అనే భావనను నిర్వచించే మూలస్తంభాలు. ఈ సాంస్కృతిక సారస్వతానికి తాజాగా యునెస్కో ఇచ్చిన గుర్తింపు మన దేశానికి మాత్రమే కాక, ప్రపంచ మానవ సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. భగవద్గీతను, నాట్యశాస్త్రాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడం ద్వారా భారతీయ విలువలకు, కళలకు అంతర్జాతీయ గౌరవం దక్కింది.

భగవద్గీతను ఒక మతపుస్తకంగా చూడటం అన్యాయమే. అదొక తత్త్వశాస్త్ర గ్రంథం. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు ఆత్మవిశ్వాసంతో, ధర్మబద్ధంగా ఎలా స్పందించాలో తెలిపే మార్గదర్శి. గీతలో అర్జునుడు తన కర్తవ్యం విషయంలో సందిగ్ధంలో పడినప్పుడు, శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశం కేవలం ఆ యుద్ధానికి మాత్రమే సంబంధించినది కాదు. అది యుగయుగాలుగా అన్ని తరాల మానవులకు వర్తించగల సందేశం. ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే వాక్యం ఎప్పటికీ మారని తత్త్వాన్ని తెలియజేస్తుంది. మనం ఫలితాల కోరిక లేకుండా, నైతికతను అనుసరించి కర్మ చేయాలని చెప్పిన ఈ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా మనుషుల జీవితాలను మార్చగల సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పుడు ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో గీతాపఠనం ఒక తత్త్వశాస్త్ర అధ్యయనంగా మారింది. అది మతపరంగా కాకుండా, తాత్వికంగా, జీవన విలువల పరంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ దృష్టితో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఇది భారతీయతకు వచ్చిన గౌరవమే కాక, ప్రపంచానికి మన జ్ఞాన సంపదను అర్థం చేసుకునే అవకాశం కూడా. గీతలోని ఉపదేశాలు విశ్వ మానవ విలువలకు దగ్గరగా ఉండటం వల్ల దీన్ని ఒక మానవతా గ్రంథంగా భావిస్తున్నారు.


నాట్యశాస్త్రం విషయానికి వస్తే, ఇది కేవలం నాట్యకళకు సంబంధించిన పుస్తకం కాదు. ఇది మన కళా సంపదకు మూలమైన శాస్త్రరూపం. నాట్యం అంటే శరీరంతో చేసే విన్యాసాలు మాత్రమే కాదు. అది భావాలు, భావోద్వేగాలు, తత్త్వాలు అన్నిటినీ సమన్వయపరిచే ఒక సమగ్ర కళ. హస్త ముద్రలు, నవరసాలు, సంగీతమూ, నృత్యంతో కలసి ఒక సందేశాన్ని ఎలా తెలియజేయాలో నాట్యశాస్త్రం స్పష్టంగా వివరిస్తోంది. భారతదేశంలోని అనేక నాట్య రూపాలు– భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ– అన్నింటికీ నాట్యశాస్త్రమే మూలంగా ఉంది. ఇవి ప్రాంతీయ కళలు మాత్రమే కాదు. ప్రతి నాట్య రూపకంలోనూ భావప్రకటన, శరీరచలనం, సంగీత సామరస్యం ఉన్నాయి.

ఈ రెండు గ్రంథాలకు యునెస్కో గుర్తింపు లభించడానికి వెనుక అనేక శ్రమలు ఉన్నాయి. భారత ప్రభుత్వం, ముఖ్యంగా ఇటీవల మోదీ ప్రభుత్వంలో, భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాల ప్రచారానికి పెద్దపీట వేసింది. విదేశాంగ శాఖ, యునెస్కో సంస్థలతో సమన్వయం, అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతినిధుల అవగాహన, ఇతర దేశాల మద్దతు– ఇవన్నీ ఈ గుర్తింపునకు కారణమయ్యాయి. ఈ గుర్తింపు మనకెంతో గర్వాన్ని కలిగించినప్పటికీ, ఇది ఒక బాధ్యతను కూడా గుర్తుచేస్తోంది. మనం ఈ సంపదను కాపాడాలి. యువతకు ఈ జ్ఞానాన్ని చేరవేయాలి. మన విద్యా వ్యవస్థలో ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. చిన్నతనం నుంచే భగవద్గీతలోని తాత్విక భావాలను, నాట్యకళలోని సున్నితత్వాన్ని, మన సంప్రదాయాల విలువను పిల్లలకు నేర్పాలి. ఇది కేవలం పాఠ్యాంశంగా కాకుండా, ఒక జీవన విధానంగా ఉండాలి.


మనకు కూచిపూడి అనే ప్రాచీన నాట్యకళ ఉంది. ఇది నాట్య శాస్త్రానికి ప్రాణం. కానీ, మనం ఈ కళను ఎంతవరకు సంరక్షిస్తున్నాం? అనే ప్రశ్న మనల్ని కాసేపు ఆలోచనలో పడేస్తుంది. ప్రభుత్వాల ప్రోత్సాహం తక్కువగా ఉండటం, పరిశోధనలకు సరైన వనరులు లేకపోవడం వల్ల, మన కళలు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నాట్య పాఠశాలలు, కళా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలను స్థాపించాలి. కూచిపూడి నాట్యకళను ప్రపంచానికి తెలియజేయగల ప్రణాళికలను తయారు చేయాలి.ఇప్పటి వరకు గీత, నాట్యశాస్త్రం లాంటి అంశాలను పాశ్చాత్య దేశాలు చాలాసార్లు ‘పౌరాణిక రచనలు’, లేదా ‘తక్కువ విలువ ఉన్న విషయాలు’గా చూశాయి. కానీ ఇప్పుడు అదే ప్రపంచం వాటిని శాస్త్రీయంగా అంగీకరిస్తోంది. ఇది ఒక పెద్ద సాంస్కృతిక మార్పు. ప్రస్తుత గుర్తింపు కేవలం ఒక పురస్కారం కాదు. గీతా, నాట్యశాస్త్రం లాంటి గ్రంథాల పరిరక్షణ మనకు లభించిన అవకాశంగా కాకుండా, ఒక కర్తవ్యంగా భావించాలి. భారతీయత అనేది మాటల్లో చెప్పే భావం కాదు. అది అనుభవంలో, ప్రవర్తనలో, జీవనశైలిలో ప్రత్యక్షమవుతుంది. గీతలోని ధర్మబద్ధతను మన వృత్తిజీవితంలో పాటించాలి. నాట్యశాస్త్రంలోని కళాసౌందర్యాన్ని మన వ్యక్తిత్వంలోనూ కలుపుకోవాలి. మనం మన జ్ఞాన సంపదను మనం గౌరవిస్తే, ప్రపంచం కూడా గౌరవిస్తుంది. విద్య, పరిశోధన, కళ, తత్త్వశాస్త్రం– అన్నింటిలో మన సంపదను అర్థవంతంగా వినియోగించాలి. అప్పుడు మాత్రమే ఈ యునెస్కో గుర్తింపు సార్థకం అవుతుంది.

అప్పన్న గొనప

ఇవి కూడా చదవండి..

PM Modi: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ

Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 20 , 2025 | 03:31 AM