Krishlal Issardasani: ట్రంప్ సర్కారుకు కోర్టు ఝలక్!
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:08 AM
అమెరికాలో విద్యార్థి వీసా రద్దుపై భారతీయ విద్యార్థి క్రిష్లాల్ కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి స్టే ఇచ్చారు. ఎలాంటి నేరానికి పాల్పడలేదని పేర్కొంటూ సెవిస్ రికార్డు తొలగింపును తాత్కాలికంగా నిలిపివేశారు.
భారత విద్యార్థి వీసా రద్దుపై స్టే
న్యూయార్క్, ఏప్రిల్ 16: విద్యార్థి వీసా రద్దు విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ విద్యార్థి వీసా రద్దును ఫెడరల్ న్యాయమూర్తి అడ్డుకున్నారు. భారత్కు చెందిన క్రిష్లాల్ ఇస్సార్దాసాని(21) విస్కాన్సిన్-మాడిసన్ వర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్ చదువుతున్నారు. ఈ ఏడాది మే నెలలో అతని గ్రాడ్యుయేషన్ పూర్తికానుంది. బార్ వెలుపల గొడవ పడ్డారనే కారణంతో 2024 నవంబరు 22న క్రిష్ను అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో అతనిపై అభియోగాలు మోపడానికి డేన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ నిరాకరించారు. ఈ వ్యవహారంలో అతను కోర్టుకు కూడా హాజరుకాలేదు. ఈ క్రమంలో ఏప్రిల్ 4న క్రిష్లాల్ విద్యా ర్థి వీసాను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (సెవిస్) డేటాబేస్ నుంచి అతని రికార్డును తొలగించింది.
దీనిపై అతను ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. రికార్డు తొలగింపుపై తాత్కాలిక స్టే ఇవ్వాలని మాడిసన్ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ‘సెవిస్ రికార్డు రద్దు చేయడానికి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు, ముందస్తు సమాచారం ఇవ్వలేదు. తప్పు చేసి ఉంటే దానిపై వివరణ ఇవ్వడానికి గానీ, సమర్థించుకోవడానికి గానీ అవకాశం కూడా ఇవ్వలేదు’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనల అనంతరం క్రిష్లాల్ బహిష్కరణపై స్టే విధిస్తూ న్యాయమూర్తి విలియం కోన్లీ మంగళవారం తీర్పు వెలువరించారు. క్రిష్ ఎలాంటి నేరాన్ని పాల్పడలేదని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి...