గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడింది
ABN , Publish Date - Mar 15 , 2025 | 05:33 AM
హమా్సపై ప్రతీకార దాడుల్లో భాగంగా గాజాలో పాలస్తీనా మహిళలపై ఇజ్రాయెల్ బలగాలు అత్యాచారం, లైంగిక హింసకు పాల్పడినట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నివేదికలో పేర్కొంది.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నివేదిక
జెనీవా, మార్చి14: హమా్సపై ప్రతీకార దాడుల్లో భాగంగా గాజాలో పాలస్తీనా మహిళలపై ఇజ్రాయెల్ బలగాలు అత్యాచారం, లైంగిక హింసకు పాల్పడినట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నివేదికలో పేర్కొంది. క్రమపద్ధతిలో ఓ జాతిని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ యత్నించిందని ఆరోపించింది. పౌరప్రాంతాలపై భారీ పేలుడు పదార్థాల వినియోగంతో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడిందని నివేదికలో పేర్కొంది. ఈ నివేదికపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మండిపడ్డారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఏకపక్షంగా ఇచ్చిన నివేదికగా పేర్కొన్నారు.
ఉగ్రవాదులకు అనుకూలంగా ఇచ్చిన నివేదికగా ఆయన అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి స్టెఫానిక్ కూడా మానవ హక్కుల మండలి నివేదికను తప్పుబట్టారు. ఇదిలా ఉండగా, పాలస్తీనాకు అనుకూలంగా గతేడాది నిరసనలకు దిగిన విద్యార్థులపై కొలంబియా యూనివర్సిటీ కొరడా ఝుళిపించింది. ఆందోళనల్లో భాగంగా వర్సిటీ క్యాంపస్ భవనాలను ఆక్రమించిన వారికి వివిధ రకాల శిక్షలు విధించినట్లు గురువారం తెలిపింది. సంవత్సరాల తరబడి సస్పెన్షన్లు, తాత్కాలికంగా డిగ్రీ రద్దు చేయడం, క్యాంపస్ నుంచి బహిష్కరణ తదితర ఆంక్షలు విధించినట్లు ప్రకటించింది.