Hyperloop Tube: గంటకి వెయ్యి కి.మీ ప్రయాణం..హైపర్లూప్ ట్యూబ్ వీడియో చూశారా..
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:38 PM
2013లో ఎలన్ మస్క్ హైపర్ లూప్ టెక్నాలజీని తెరపైకి తెచ్చాడు. అప్పటినుంచి ప్రపంచ వ్యాప్తంగా దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో మద్రాస్ ఐఐటీలో హైపర్లూప్ ట్యూబ్ టెస్టింగ్ విభాగం ఉంది.

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా మద్రాస్ ఐఐటీకి వెళ్లారు. అక్కడ ఉన్న హైపర్లూప్ టెస్టింగ్ విభాగాన్ని సందర్శించారు. హైపర్లూప్ ట్యూబ్కు సంబంధించి అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతో ఆసక్తిగా దాని పని తీరును పరిశీలించారు. హైపర్లూప్ ట్యూబ్ పాడ్ ప్రయాణించిన తీరుకు ఆయన ఖుషీ అయిపోయారు. సంతోషంతో కేరింతలు కొట్టారు. హైపర్లూప్ ట్యూబ్కు సంబంధించిన వీడియోను తన ఇన్గ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘ మద్రాస్ ఐఐటీలో హైపర్లూప్ ట్యూబ్ టెస్టింగ్ విభాగం 410 మీటర్ల పొడవుతో ఉంది. అది ఏషియాలోనే పొడవైన హైపర్లూప్ ట్యూబ్ టెస్టింగ్ విభాగంగా పేరుగాంచింది. ఆ పొడవును మరింత పెంచనున్నాము. అప్పుడది ప్రపంచంలోనే పొడవైన హైపర్లూప్ ట్యూబ్ టెస్టింగ్ విభాగంగా ప్రసిద్ధికెక్కుతుంది’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ముందు లోకల్ ట్రైన్లను సక్కాగా నడపండి.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఏడేళ్ల నుంచి శ్రమిస్తున్న ఐఐటీ మద్రాస్..
మద్రాస్ ఐఐటీ ఏడేళ్లనుంచి హైపర్ లూప్ టెక్నాలజీపై పని చేస్తోంది. పరిశోధనలు చేయడానికి అవసరమైన అన్ని వసతులను కల్పిస్తోంది. అంతేకాదు.. తాజాగా, గ్లోబల్ హైపర్ లూప్ కాంపిటీషన్ పేరిట ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. రైల్వే శాఖ 2022 మే నెలలో హైపర్ లూప్ టెక్నాలజీ అభివృద్ధి కోసం ఐఐటీ మద్రాస్కు 8.34 కోట్ల రూపాయల్ని కేటాయించింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన సందర్శన సందర్భంగా.. హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్కు ఇండియా సిద్ధంగా ఉండాలని అన్నారు. హైపర్లూప్ టెస్టింగ్ విభాగంలో పరిశోధనలు చేస్తున్న యువతకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎలన్ మస్క్ ఆలోచనే..
హైపర్ లూప్ టెక్నాలజీని తెరపైకి తెచ్చింది ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్. 2013లో హైపర్ లూప్ గురించి కొన్ని విషయాలు వెల్లడించాడు. అయస్కాంత శక్తి నిండిన ఇనుప ట్యూబుల ద్వారా వేగవంతమైన ప్రయాణం సాధ్యపడుతుందని తెలిపాడు. గంటకు 1000 కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణం చేయవచ్చని అన్నాడు. 2013 నుంచి ఇప్పటి వరకు హైపర్ లూప్ టెక్నాలజీపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 12 ఏళ్లు గడుస్తున్నా ఇంకా టెస్టింగ్లోనే హైపర్ ల్యూప్ టెక్నాలజీ ఉంది. మరికొన్నేళ్లలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, కొంతమంది హైపర్ లూప్ టెక్నాలజీ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Rajnath Singh: రాజ్నాథ్ సింగ్తో అమెరికా ఇంటెల్ చీఫ్ తులసీ గబ్బర్డ్ భేటీ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Kharge: డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.