ట్రాక్టర్ కింద పడి రైతు దుర్మరణం
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:13 AM
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బండకొత్తపల్లి గ్రామంలో గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది.
ట్రాక్టర్ కింద పడి రైతు దుర్మరణం
గుండాల, ఏప్రిల్ 18 (ఆం ధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బండకొత్తపల్లి గ్రామంలో గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... బండకొత్తపల్లి గ్రామానికి చెందిన గంగాపురం రామకృష్ణ (43) తనకున్న నాలుగు ఎకరాలు సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. వారం రోజుల క్రితం రెండు ఎకరాలు కోత కోశాడు. గురువారం రాత్రి మిగిలిన రెండు ఎకరాల పొలాన్ని మిషనతో కోత కోయించాడు. ధాన్యాన్ని తన ట్రాక్టర్లో గ్రామంలోని ఐకేపీ కేంద్రానికి తరలించాడు. ఐకేపీ కేంద్రంలో ధాన్యాన్ని పోసిన తర్వాత తిరిగి వెళ్తుండగా ట్రాక్టర్ ధాన్యం రాశులు ఎక్కడంతో రామకృష్ణ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి కింద పడ్డాడు. దీంతో ట్రాక్టర్ ట్రక్కు టైరు తలపైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన రైతులు ఐకేపీ కేంద్రానికి వచ్చే సరికి రామకృష్ణ మృతి చెందినట్లు ఉండటంతో కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు పాల్గొన్నారు. మృతుడు రామకృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.