MRPS: మంద కృష్ణ మా నాయకుడు కాదు
ABN , Publish Date - Mar 13 , 2025 | 05:22 AM
మాదిగలను మోసం చేసిన మంద కృష్ణ మాదిగ తమ నాయకుడు కాదని, ఆయనను ఎమ్మార్పీఎస్ నుంచి బహిష్కరిస్తున్నామని మొట్టమొదటి ఎమ్మార్పీఎస్ ఉద్యమకారులు పేర్కొన్నారు.

ఆయనను ఎమ్మార్పీఎస్ నుంచి బహిష్కరిస్తున్నాం
మొట్టమొదటి ఎమ్మార్పీఎస్ ఉద్యమకారులు
పంజాగుట్ట, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మాదిగలను మోసం చేసిన మంద కృష్ణ మాదిగ తమ నాయకుడు కాదని, ఆయనను ఎమ్మార్పీఎస్ నుంచి బహిష్కరిస్తున్నామని మొట్టమొదటి ఎమ్మార్పీఎస్ ఉద్యమకారులు పేర్కొన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు దేవని సతీష్ మాదిగ అధ్యక్షతన మొట్టమొదటి ఎమ్మార్పీఎస్ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉద్యమకారులు, నాయకులు తమ అనుభవాలను పంచుకున్నారు. కొంత మంది కుహనా ఉద్యమ నాయకులు అమాయకులైన మాదిగ నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారని వారు ఆరోపించారు.
రాష్ట్రంలో వర్గీకరణను అడ్డుకోవడానికి మంద కృష్ణ మాదిగ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను బదనాం చేయడానికే మంద కృష్ణ దీక్షలు చేస్తున్నారని, ఆ దీక్షల వెనుక బీజేపీ ఉందని అన్నారు. ఈ సమ్మేళనంలో మాజీమంత్రి ఏ. చంద్రశేఖర్, కృపాకర్ మాదిగ, మేరీ మాదిగ, చిట్టిబాబు మాదిగ, ప్రకాష్ మాదిగ, రాయికంటి రామదాస్, పిడమర్తి రవి, పాలడుగు శ్రీనివాస్, జన్ను జయరాజ్, కొండ్రు శంకర్, ముంజుగల్ల విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.