ఓపెన్ పరీక్షలో మాస్కాపీయింగ్
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:23 AM
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి.
ఓపెన్ టెన్త్ పరీక్షలకు ఒకరికి బదులు మరో అభ్యర్థి
తనిఖీల్లో పట్టుకున్న తహసీల్దార్
ఇద్దరిపై కేసు నమోదు
మిర్యాలగూడ, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఓపెన్ టెన్త్ పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. పరీక్షా నిర్వహకులు నిబంధనలకు పాతరేసి పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ చేయిస్తున్నారని ఆరోప ణలు రావడంతో గురువారం సబ్కలెక్టర్ నారాయణ అమిత్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా మిర్యా లగూడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఒకరికి బదులుగా మరో అభ్యర్థి పరీక్ష రాస్తుండగా తహసీల్దార్ హరిబాబు, ఎంఈవో బాలునాయక్ పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బకాల్వాడ ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్ పరీక్షలకు దరఖాస్తు చేసిన గువ్వల శ్రీనివాస్కు స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో సెంటర్ పడింది. గువ్వల శ్రీనివాస్కు బదులుగా అప్పాముల ఎనివాస్ అనే మరో విద్యార్ధి పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి పరీక్షలు జరుగుతుండగా చివరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్ష జరుగుతుందన్నారు. ఓపెన్టెన్త్ పరీక్షల్లో భారీగా అవకతవకలు జరు గుతున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వస్కుల మట్టయ్య సబ్ కలెక్టర్కు లిఖితపూ ర్వక ఫిర్యాదు చేశారని, దీంతో తహసీల్దార్ హరిబాబును, ఎంఈవో బాలునాయక్ను తనిఖీలు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం-8లో తనిఖీలు చేయగా 166 రూల్నెంబర్పై అభ్యర్థికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వెంటనే వన్టౌన్ ఫోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు, కోఆర్డినేటర్లపై విచారణ చేసి డీఈవోకు నివేదిక అందజేస్తామని తెలిపారు.