నామినేషన్ల జోరు
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:28 AM
రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి శుక్రవారం బొమ్మూరు కలెక్టరేట్లో 10-30కు రిటర్నింగ్ అధికారి తేజ్భరత్కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
భారీ జన సమీకరణలతో నాయకుల ర్యాలీ
కదం తొక్కిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు
రాజమహేంద్రవరంరూరల్ అభ్యర్థి గోరంట్ల నామినేషన్ దాఖలు
కడియం/ రాజమహేంద్రవరంరూరల్, ఏప్రిల్ 19: రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి శుక్రవారం బొమ్మూరు కలెక్టరేట్లో 10-30కు రిటర్నింగ్ అధికారి తేజ్భరత్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ముందుగా సోమాలమ్మ ఆలయంలో తమ కుటుంబసభ్యులుతో గోరంట్ల ప్రత్యేకపూజలు చేశారు. గోరంట్ల తన నివాసం నుంచి ఎన్నికల ప్రచార వాహనంపై కుటుంబ సమేతంగా గోరంట్ల కుమార్తె కంఠమనేని శిరీష, రాష్ట్ర వైద్యవిభాగం ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్కిరణ్, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ జనసందోహంతో, భారీ బైక్ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్కు చేరుకున్నారు ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్యచౌదరి రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్యేటి ప్రసాద్, జనసేన కడియం మండల అధ్యక్షుడుముద్రగడ వీరేష్, న్యాయవాదులు కలిపి రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి నామినేషన్
కొవ్వూరు, ఏప్రిల్ 19: రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన టీడీపీ సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్యుతరామయ్య(అచ్చిబాబు) ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ముప్పిడి ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరిల ఆధ్వర్యంలో మెరకవీధి వినాయకునిగుడి, కనకదుర్గమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. నియోకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో కొవ్వూరు పట్టణమంతా జన సందోహంగా మారింది. జనసైనికులు చిరంజీవి, రామ్చరణ్, పవన్కల్యాణ్ చిత్రపటాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్, విజయవిహార్ సెంటర్మీదుగా ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్న ము ప్పిడి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, మద్దిపట్ల శివరామకృష్ణ, అల్లూరి విక్రమాదిత్య, బీజేపీ నాయకుడు పరిమి రాధాకృష్ణ, జనసేన ఇన్ చార్జి టీవీ రామారావు, నామన పరమేష్, వట్టికూటి వెంకటేశ్వరరావు, ఆళ్ల హరిబాబు, నాదెళ్ల శ్రీరామ్, సూరపనేని చిన్ని, రంజిత్ పాల్గొన్నారు.
కూటమి నిడదవోలు అభ్యర్థిగా దుర్గేష్ నామినేషన్
నిడదవోలు, ఏప్రిల్ 19: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేష్ శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వీ రమణ నాయక్కు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, జనసేన నాయకుడు భోగవల్లి ప్రసాద్, బీజేపీ నాయకుడు బండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అమలాపురం కూటమి అభ్యర్థిగా ఆనందరావు నామినేషన్
అమలాపురంటౌన్, ఏప్రిల్ 19: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో జి.కేశవర్థనరెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు.
రంపలో మిరియాల శిరీషాదేవి నామినేషన్ దాఖలు
రంపచోడవరం, ఏప్రిల్ 19: రంపచోడవరం ఎస్టీ రిజర్వుడు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మిరియాల శిరీషదేవి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఈమె ఒక్కరే నామినేషన్ దాఖ లు చేశారని రిటర్నింగ్ అధికారి ప్రశాంతకుమార్ అధికారికంగా ప్రకటించారు. రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబూరమేష్ ఈమె నామినేషన్ను ప్రతిపాదించారు. నామినేషన్ ప్రాథమిక పరిశీలన అనంతరం, రూ.5వేల ధరావత్తు చెల్లించాక రిటర్నింగ్ అధికారి శిరీషదేవితో ప్రమాణం చేయించారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఈమెతో పాటు మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబూ రమేష్, అధిష్టానం పంపిన తెలుగుదేశం నాయకుడు యర్రా వేణుగోపాలనాయుడు, శిరీషదేవి భర్త టీడీపీ యువజన నాయకుడు మఠం విజయభాస్కర్, ఆమె తరపు న్యాయవాది హాజరయ్యారు. కాగా మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, శీతంశెట్టి వెంకటేశ్వ రరావులు మాత్రం హాజరు కాలేదు.
అనపర్తి టీడీపీ అభ్యర్థినిగా మహాలక్ష్మి నామినేషన్
అనపర్తి, ఏప్రిల్ 19 : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనపర్తి అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థినిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామ కృష్ణా రెడ్డి సతీమణి మహాలక్ష్మి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనపర్తిలోని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో ఆమె తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారిణి ఎం.మాధురికి అందజేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇదే మొదటి నామినేషన్ దాఖలు కావడం జరిగిందని ఆర్వో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వెంట టీడీపీ నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, తమలంపూడి సుధాకరరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, నల్లమిల్లి గోపాలకృష్ణారెడ్డి ఉన్నారు.
జగ్గంపేట టీడీపీ అభ్యర్థిగా జ్యోతుల నామినేషన్
జగ్గంపేట, ఏప్రిల్ 19: టీడీపీ-జనసేన-బీజేపీ జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ శుక్రవారం ఉదయం 11.30గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక స్వగృహం నుంచి బయలుదేరి జగ్గంపేట గ్రామదేవత రావులమ్మతల్లి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 11.11 నిమిషాలకు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి అక్కడినుంచి ఐదుగురి సభ్యులతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అఽధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. ఆయన వెంట జనసేన జగ్గంపేట ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్, కొత్త కొండబాబు ఉన్నారు.
అట్టహాసంగా పంతం నానాజీ నామినేషన్ దాఖలు
సర్పవరం జంక్షన్, ఏప్రిల్ 19: కాకినాడ రూరల్ అసెంబ్లీ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా పంతం వెంకటేశ్వరరావు(నానాజీ) అట్టహాసంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ముందుగా కాకినాడ రూరల్ గొడారిగుంటలో పూజలు నిర్వహించారు. అనంతరం వలసపాకల గంగరాజునగర్లో జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడినుంచి టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కోకోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్(బాబీ), పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్లతో కార్యకర్తలతో కలిసి సర్పవరం జంక్షన్ ఆర్వో కార్యాలయానికి పాదయాత్ర ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్కు నానాజీ అందించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, కాళ్ల ధనరాజు, రంబాల వెంకటేశ్వరరావు, కౌజు నెహ్రూ, కాళ్ల సత్తిబాబు, పేరాబత్తుల లోవబాబు పాల్గొన్నారు.
కోలాహలంగా కొండబాబు నామినేషన్
కాకినాడసిటీ, ఏప్రిల్ 19: కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు శుక్రవారం కోలాహలంగా నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జగన్నాథపురంలోని తన స్వగృహంనుంచి కొండబాబు కూటమి పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన నాయకులు చిక్కాల దొరబాబు, తోట సుఽధీర్, బీజేపీ నాయకులు పైడా భవనప్రసాద్, గట్టి సత్యనారాయణ తదితర నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజే శారు. అశేష జన సందోహంతో కోలాహలం మధ్య అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమంతో నగరం పసుపుమయంగా మారింది. కొండబాబు సైకిల్ ర్యాలీగా బయలు దేరి చర్చిస్క్వేర్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ బ్రిడ్జి, వార్ఫ్ రోడ్, సినిమారోడ్, కొత్తపేట బ్రిడ్జి, కోకిల సెంటర్, భానుగుడి సెంటర్, కొండయ్యపాలెం మీదుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత కొండబాబు స్వగృహం వద్ద సర్వమత ప్రార్థనలు జరిపి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నామినేషన్ దాఖలు చేసిన జక్కంపూడి
రాజానగరం, ఏప్రిల్ 19 : రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంద్ర వందిత్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈమేరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.చైత్రవర్షిణికి అందజేశారు. అలాగే రాజా సతీమణి రాజశ్రీ మరో సెట్ నామినేషన్ పత్రం దాఖలు చేశారు. తొలుత స్ధానిక సాయిబాబాను దర్శించుకున్న అనంతరం వారు నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు.
‘పొన్నాడ’ నామినేషన్
ముమ్మిడివరం, ఏప్రిల్ 19: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ తరపున పొన్నాడ వెంకటసతీష్కుమార్ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన సతీమణి పొన్నాడ నీరజ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసినట్టు రిటర్నింగ్ అధికారి వి.మదన్మోహనరావు తెలిపారు.
ప్రత్తిపాడులో వరుపుల నామినేషన్ దాఖలు
ప్రత్తిపాడు, ఏప్రిల్ 19: ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరుపుల సుబ్బారావు శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ను దాఖలు చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలనుంచి భారీ అనుచరగణంతో ఆయన ప్రత్తిపాడు చేరుకున్నారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో వరుపుల నామినేషన్ పత్రాలను ఆర్వో ఎ.శ్రీనివాసరావుకు అందజేశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ అనంతబాబు, శంఖవరం మండలాధ్యక్షుడు పర్వత రాజబాబు, వరుపుల తనయుడు సూరిబాబు, గొల్లాజీలు ఉన్నారు.