Share News

హైదరాబాదీకి లండన్‌లో 16 ఏళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Apr 28 , 2024 | 06:21 AM

మాజీ ప్రియురాలిపై రెండేళ్ల క్రితం హత్యాయత్నం చేసినందుకు భారత దేశానికి చెందిన శ్రీరాం అంబర్ల (25)కు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ లండన్‌లోని ఓల్డ్‌ బెయిలీ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. రెస్టారెంట్లో ఉండగా ఆమెను కత్తితో పొడిచినట్టు రుజువు కావడంతో ఈ శిక్ష వేసింది.

హైదరాబాదీకి లండన్‌లో 16 ఏళ్ల జైలు శిక్ష

మాజీ ప్రియురాలిపై హత్యాయత్నం.. రెస్టారెంట్లో కత్తిపోట్లు

లండన్‌, ఏప్రిల్‌ 27: మాజీ ప్రియురాలిపై రెండేళ్ల క్రితం హత్యాయత్నం చేసినందుకు భారత దేశానికి చెందిన శ్రీరాం అంబర్ల (25)కు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ లండన్‌లోని ఓల్డ్‌ బెయిలీ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. రెస్టారెంట్లో ఉండగా ఆమెను కత్తితో పొడిచినట్టు రుజువు కావడంతో ఈ శిక్ష వేసింది. శ్రీరాంకు, 20ల్లో ఉన్న కేరళ యువతికి హైదరాబాద్‌లో పరిచయం ఏర్పడింది.

2019లో వారు విడిపోయారు. 2022లో ఇద్దరూ ఈస్ట్‌ లండన్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువుల నిమిత్తం చేరారు. అదే సమయంలో ఆమె ఓ రెస్టారెంట్‌లో పార్ట్‌టైం వెయిట్రె్‌సగా కూడా పనిచేయడం ప్రారంభించింది. మళ్లీ ఎదురుపడ్డ నుంచి ఆమెను బెదిరించడం, కొట్టడం ప్రారంభించాడు.

2022 మార్చిలో ఈస్ట్‌ లండన్‌(London)లోని హైదరాబాదీ రెస్టారెంట్‌లో ఉండగా ఆమెను కత్తితో తొమ్మిది సార్లు పొడిచాడు.

తీవ్రంగా గాయాలపాలైన ఆమె నెల రోజుల పాటు క్రిటికల్‌ కేర్‌లో ఉండాల్సి వచ్చింది. ఆరు ఆపరేషన్లు జరిగాయి. కత్తితో పొడిచిన వెంటనే శ్రీరాం పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తన గర్ల్‌ ఫ్రెండ్‌ను కత్తితో పొడిచినట్టు అంగీకరించాడు. తనను భారత్‌కు తిప్పి పంపించివేయాలని, అక్కడ మరణ శిక్ష విధించవచ్చని తెలిపాడు.

కత్తిపోట్ల సంఘటన సీసీటీవీ కెమేరాల్లో రికార్డు కావడంతో అదే సాక్ష్యంగా పనికొచ్చింది. విచారణ జరిపిన జడ్జి ఫిలిప్‌ కట్జ్‌..శ్రీరాంను అసూయపరుడు, ఎవరినైనా అదుపులోకి తీసుకోవాలన్న మనస్తత్వం కలవాడని అభిప్రాయపడ్డారు.

పబ్లిక్‌ స్థలంలో భయంకరమైన మరణాన్ని వెంట్రుకవాసిలో ఆమె తప్పించుకొందని వ్యాఖ్యానించారు.

హత్యాయత్నం నేరానికి 16 ఏళ్ల జైలు శిక్ష, కత్తిని కలిగి ఉన్నందుకు మరో 12 నెలల జైలు శిక్ష విధించారు. రెంటింటినీ ఏకకాలంలో అనుభవించాలని ఆదేశించారు. ఆమెను ఇకపై కలవడానికి ప్రయత్నించకూడదంటూ దీర్ఘకాల నియంత్రణ ఉత్తర్వును జారీ చేశారు.

శ్రీరాం అంబర్ల మనస్తత్వాన్ని అధ్యయనం చేసిన ఇద్దరు ఫోరెన్సిక్‌ సైకాలజిస్టులు..అతడు ప్రమాదకర ముద్దాయి అని తెలిపారు. ‘బోర్డర్‌లైన్‌ పర్సనాలిటీ డిజార్డర్‌’తో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. వీరిచ్చిన నివేదిక, సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన భయంకర దృశ్యాలను ఆఽధారం చేసుకొని జడ్జి కఠిన శిక్ష విధించారు.

Updated Date - Apr 28 , 2024 | 06:59 AM