Share News

రాష్ట్రాభివృద్ధికే పొత్తు

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:46 PM

రాష్ట్రాభివృద్ధికే పొత్తు

రాష్ట్రాభివృద్ధికే పొత్తు

అన్ని వర్గాలను మోసం చేసిన జగన్‌

వైసీపీకి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బీసీ పిలుపు

సంజామల, ఏప్రిల్‌ 19 : రాష్ట్ర అభివృద్ధి కోసమేబీజేపీ, జనసేనలతో టీడీపీ పొత్తు పెట్టుకున్నదని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం నియోజకవర్గంలోని సంజామల మండల కేంద్రంలో నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరితో కలసి ప్రచార సభ నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న నాయకులకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా బీసీ మాట్లాడుతూ తాను మండలానికి, సంజామలకు చేసిన అభివృద్ధి ఎమ్మెల్యే కాటసాని చేశారా? అని ప్రజలను సూటిగా ప్రశ్నించారు. ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్‌ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు. పంచాయతీల నిధులను మళ్లించి గ్రామాల అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. కార్పొరేషన్‌లను నిర్వీర్యం చేయడంతో నిరుద్యోగ యువకులు ఉపాఽధి లేక రోడ్లపై పడ్డారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పడుతుంటే తాను అండగా ఉన్నానని చెప్పారు. చంద్రబాబు ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడని, అన్ని రకాలుగా అలోచించే జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారని స్పష్టం చేశారు. దీన్ని వైసీపీ నాయకులు రాజకీయం చేయడం సిగ్గు చేటని అన్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే తొలి సంతకం డీఎస్సీపై పెడతారని తెలిపారు. తాను ఎమ్మెల్యే కాగానే సంజామలలో షాదీఖానా నిర్మాణం చేపడతానని అన్నారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రభుత్వ రాయితీలు కల్పిస్తామన్నారు ఎంపీ అభ్యర్థి శబరి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ప్రజలకు ఏమైనా చేశారా అని నిలదీశారు. పెండేకంటి కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ బీసీతోనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమన్నారు. 2014లో బీసీ జనార్దన్‌రెడ్డి వెంట ఉండి ఆయన గమనించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవెలకుంట్ల మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ పెండేకంటి కిరణ్‌కుమార్‌, ఆయన సోదరుడు రమణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:46 PM