నంద్యాల టీడీపీ అభ్యర్థిగా ఫరూక్ నామినేషన్
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:12 AM
నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధిగా ఎన్ఎండీ ఫరూక్ శుక్రవార నామినేషన్ దాఖలు చేశారు.
నంద్యాల (నూనెపల్లె), ఏప్రిల్ 19: నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధిగా ఎన్ఎండీ ఫరూక్ శుక్రవార నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ఆయన మసీదుకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నంద్యాల తహసీల్దారు కార్యాలయ ఆవరణలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జేసీ రాహుల్కుమార్రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఫరూక్ వెంట టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నాయ్యవాది వెదుర్ల రామచంద్రారావు, టీడీపీ ముస్లిం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ తదితరులు ఉన్నారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత కార్యాలయ ఆవరణలో ఫరూక్ మీడియాతో మాట్లాడారు. ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డికి ఓటు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, మౌలిక సమస్యలను, తమ దృష్టికి తీసుకువస్తుంటే తీవ్ర ఆవేదనకు గురికావాల్సి వస్తోందన్నారు. ప్రజలు టీడీపీ పక్షాన ఉన్నారని, అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే నంద్యాలలో స్థానిక ప్రజా ప్రతినిధి అబివృద్ధి చేశామంటూ ఊదరగొట్టుకోవడమే తప్ప చేసిందేమీ లేదని అన్నారు. నంద్యాల నియోజకవర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారంలో వైసీపీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
ప్రజలు ఓటుతోనే బుద్ధి చెబుతారు: శబరి
వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటుతో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి అన్నారు. ఫరూక్ నామినేషన్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్ని రంగాలను నిర్వీర్యం చేసిన జగన్కు ఏ వర్గ ప్రజలు ఓటు వేయరని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగంతో ఇబ్బందుపడుతున్నారని అన్నారు. పెరిగిన ధరలు, బిల్లులు, పన్నులతో సగటు మానవుడు కుదేలయ్యారని ఆమె అన్నారు. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ప్రజలు ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు.