Share News

లోగ్రేడ్‌ మార్కెట్‌ ఒడిదొడుకులు

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:10 AM

పొగాకు మార్కెట్‌ ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి లోగ్రేడ్‌ రకం కొనుగోళ్లు మందగించాయి. వారం క్రితం వరకూ పోటాపోటీగా కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం నిరా సక్తత కనబరుస్తున్నారు.

లోగ్రేడ్‌ మార్కెట్‌ ఒడిదొడుకులు

కొనుగోలుకు కొన్ని కంపెనీల నిరాసక్తత

పెరుగుతున్న నోబిడ్‌లు

పొగాకు రైతుల్లో ఆందోళన

తాజా పరిస్థితిపై బోర్డు ఆర్‌ఎం సమీక్ష

కిలో రూ.256 పలికిన మేలురకం గరిష్ఠ ధర

ఒంగోలు, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్‌ ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి లోగ్రేడ్‌ రకం కొనుగోళ్లు మందగించాయి. వారం క్రితం వరకూ పోటాపోటీగా కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం నిరా సక్తత కనబరుస్తున్నారు. శుక్రవారం పలు వేలం కేంద్రాల్లో 25నుంచి 35శాతం వరకు లోగ్రేడ్‌ బేళ్లు నోడ్‌ బిడ్‌ (తిరస్కరణ) అయ్యాయి. దీనిపై రైతుల్లో తీవ్ర ఆందోళనవ్యక్తమవడంతో సాయంత్రం వేలం కేంద్రం అధికారులు, రైతు కమి టీల ప్రతినిధులతో ఆర్‌ఎం లక్ష్మణరావు ఒంగోలులోని తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు. ఈఏడాది పొగాకు కొనుగోళ్ల ప్రారంభం నుంచి లోగ్రేడ్‌కు మంచి ధరలే లభించాయి. అందులో కాస్త నాణ్యత బాగున్న బేళ్లను దాదాపు మేలు రకం ధరతో సమానంగా వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇక పొగాకు ఎలా ఉన్నా కిలో రూ.200కు తగ్గకుండా లోగ్రేడ్‌ను కొన్నవారు పది రోజుల క్రితం గరిష్ఠంగా రూ.233 వరకూ ఇచ్చారు.

వారం నుంచి ధరలు తగ్గుముఖం

లోగ్రేడ్‌ ధరలను వ్యాపారులు వారం రోజులుగా తగ్గిస్తూ వస్తున్నారు. అదే సమయంలో నోబిడ్‌లు పెరుగుతున్నాయి. తొలుత కర్ణాటక పొగాకులో కలుపు కొనేందుకు ఇక్కడ లోగ్రేడ్‌ను హాట్‌హాట్‌గా కొన్న వ్యాపారులు ప్రస్తుతం ఆ అవసరం తగ్గడంతో వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. రెండు, మూడు ఎక్స్‌పోర్టు కంపెనీల బయ్యర్లు శుక్రవారం మార్కెట్లో కొనుగోళ్లకు నిరాసక్తత చూపారు. దీంతో ప్రధానంగా పచ్చ, ఎర్రనేలల్లో పండే మాడు రకం బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆయా వేలం కేంద్రాల్లోని రైతులు ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేయడంతో బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్‌ఎం లక్ష్మణరావు వెంటనే స్పందించి సాయంత్రానికి అధికారులు, రైతు ప్రతినిధులతో ఒంగోలులోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బోర్డు సభ్యులు బ్రహ్మయ్య, పొద ప్రసాదరావులతోపాటు వేలం కేంద్రాల అధికారులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న రకం బేళ్లను వేలంకు తీసుకురావాలని, ప్రస్తుతం ఉన్న ధరలు తగ్గకుండా చూస్తా మని అధికారులు ఈ సమావేశంలో రైతులకు సూచించారు. సోమవారం నా టికి పరిస్థితిలో మార్పు ఉండాలని రైతులు డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

పెరుగుతున్న మేలు రకం పొగాకు ధరలు

మార్కెట్‌లో మేలు రకం పొగాకు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దాదాపు నెలరోజులపాటు కిలో రూ.238పై నిలకడగా సాగిన మేలు రకం గరిష్ఠ ధర వారం క్రితం రూ.249 పలికింది. రెండు రోజుల నుంచి మళ్లీ కొద్దికొద్దిగా పెరుగుతోంది. శుక్రవారం ఒంగోలు-2లో గరిష్ఠ ధర కిలోకు రూ.256 లభించింది. ఇతర చోట్ల కూడా గరిష్ఠ ధర కిలో రూ.254 వరకు ఉన్నట్లు సమాచారం.

Updated Date - Apr 20 , 2024 | 01:10 AM