Share News

క్వార్టర్‌ కోసం హత్య

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:04 AM

ఎర్రగొండపాలెంలోని త్రిపురాంతకం రోడ్డులో గురువారం రాత్రి జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు.

క్వార్టర్‌ కోసం హత్య

ఎర్రగొండపాలెం, ఏప్రిల్‌ 27 : ఎర్రగొండపాలెంలోని త్రిపురాంతకం రోడ్డులో గురువారం రాత్రి జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గురైన వెలగల శ్రీనివాసులు(37)ను అతని స్నేహితుడు ఓరుగంటి రాజేష్‌ అలియాస్‌ రాజా హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వైపాలేనికి చెందిన వెలగల శ్రీనివాసులు, ఓరుగంటి రాజేష్‌లు మద్యానికి బానిసలయ్యారు. ఈ నెల 25న గురువారం ఉదయం శ్రీనివాసులు వద్ద రెండు మద్యం సీసాలు ఉండగా, ఒకటి ఇవ్వమని రాజా అడిగాడు. అయితే శ్రీనివాసులు ఇవ్వలేదు. దీంతో వీరి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకొంది. ఈ క్రమంలోనే రాజేష్‌పై శ్రీనివాసులు చెయ్యి చేసుకున్నాడు. దీనిని మనసులో పెట్టుకొని శ్రీనివాసులును హత్య చేయాలని రాజేష్‌ భావించాడు. నిత్యం శ్రీనివాసులు నిద్రపోయే పాతభవనం వద్దకు అర్ధరాత్రి 1.30 సమయంలో రాజేష్‌ చేరుకున్నాడు. అక్కడే ఉన్నట్లు నిర్ధారించుకుని ఇంటికి వెళ్లి ఇనుపరాడ్డును తీసుకొచ్చాడు. నిద్రిస్తున్న శ్రీనివాసులును రాడ్డుతో బలంగా మోదాడు. మృతిచెందాడని భావించి, హత్యకు ఉపయోగించిన రాడ్‌ను అక్కడే రోడ్డు పక్కన పడవేసి ఇంటికివెళ్లి పోయాడు. సీసీ పుటేజీ, డాగ్‌స్క్వాడ్‌ ఆధారంగా హత్యచేసింది ఓరుగంటి రాజేష్‌ అని పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం మార్కాపురం రోడ్‌లో సంచరిస్తుండగా రాజేష్‌ను అరెస్టు చేసినట్లు సీఐ రాములునాయక్‌ తెలిపారు. నిందితుడిని 24 గంటలలోపు కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఎస్‌.ఐ సుదర్శన్‌, పోలీసు సిబ్బంది శ్రీనివాసరావు, పి.సూర్యనారాయణ, బాష, గిరి చొరవ చూపారు.

Updated Date - Apr 28 , 2024 | 09:04 AM