ఎండ మండుతోంది..!
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:08 AM
వేసవి ఠారెత్తిస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు.
పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు
పామూరులో 44.2 డిగ్రీలు నమోదు
అత్యధిక ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటిన వైనం
విలవిల్లాడుతున్న ప్రజలు
ఒంగోలు (కలెక్టరేట్), ఏప్రిల్ 19 : వేసవి ఠారెత్తిస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. మూడు రోజులుగా జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నానికి మంటపుట్టిస్తున్నాడు. దీనికితోడు ఉక్కపోత అధికంగా ఉంటుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. శుక్రవారం కూడా జిల్లాపై సూర్యప్రతాపం కొనసాగింది. అత్యధికంగా పామూరులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొన్నలూరులో 44.1, మార్కాపురంలో 44.1, కనిగిరిలో 43.8, దొనకొండలో 43.8 ముండ్లమూరులో 43.4, హనుమంతునిపాడులో 43.4, పెద్దారవీడులో 43.3, కొమరోలులో 43.2 డిగ్రీల ఎండ కాచింది. పొదిలిలో 43.0, చీమకుర్తిలో 43.0, కంభంలో 43.2, దర్శిలో 43.1, కురిచేడులో 42.7, కొత్తపట్నంలో 42.5, కొనకనమిట్లలో 42.8డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరో 15 మండలాల్లో 40నుంచి 44 డిగ్రీల వరకూ ఎండ కాచింది. అది ఒంగోలులో 39.1 డిగ్రీలుగా ఉంది.