రెండో రోజు 28 నామినేషన్లు
ABN , Publish Date - Apr 20 , 2024 | 02:00 AM
జిల్లాలో రెండో రోజు నామినేషన్ల జోరు పెరిగింది. శుక్రవారం విశాఖ పార్లమెంటు స్థానానికి ఆరు, అసెంబ్లీ స్థానాలకు 22 మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి.
లోక్సభకు ఆరు, అసెంబ్లీ సెగ్మెంట్లకు 22 నామినేషన్లు
అత్యధికంగా పెందుర్తికి 10 నామినేషన్లు
నామినేషన్లు దాఖలు చేసిన వారిలో వెలగపూడి, ఆడారి ఆనందకుమార్, పంచకర్ల రమేష్బాబు, అదీప్రాజు, కేకే రాజు
రెండు రోజుల్లో 38 నామినేషన్లు దాఖలు
గాజువాక, ‘సౌత’లకు నామినేషన్లు నిల్
విశాఖపట్నం, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో రెండో రోజు నామినేషన్ల జోరు పెరిగింది. శుక్రవారం విశాఖ పార్లమెంటు స్థానానికి ఆరు, అసెంబ్లీ స్థానాలకు 22 మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో గడచిన రెండు రోజుల్లో జిల్లాలో దాఖలైన నామినేషన్ల సంఖ్య 38కి చేరింది. శుక్రవారం విశాఖ పార్లమెంటు స్థానానికి పెదపెంకి శివప్రసాద్ (బహుజన్ సమాజ్వాదీ పార్టీ), బన్న రమేష్ (దళిత బహుజన్ పార్టీ), సొండి కృష్ణ, చప్పిడి రాము, మహ్మద్ గౌస్ ముద్దీన్ఖాన్ (ఇండిపెండెంట్లు) ఒక్కొక్క సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నవభారత నిర్మాణ సేవా పార్టీ నుంచి చింతాడ సూర్యం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తరం, పశ్చిమ, పెందుర్తి అసెంబ్లీ స్థానాలకు 22 నామినేషన్లు దాఖలయ్యాయి. తూర్పు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే వెలగపూడి రామకష్ణబాబు, పెందుర్తి నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్బాబు తరఫున ఆయన సోదరుడు వెంకటేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ఆడారి ఆనందకుమార్, ‘నార్త్’కు వైసీపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి కేకే రాజు నామినేషన్లు దాఖలు చేశారు. సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే...భీమిలికి స్వతంత్ర అభ్యర్థులుగా బుగత రాము, నాగామమి నాగోతు ఒక్కొక్క సెట్, విశాఖ తూర్పు నియోజకవర్గానికి టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణబాబు, ఆయన సతీమణి సుజన రెండేసి సెట్లు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఇ.హైమావతి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ ఉత్తరం నియోజకవర్గానికి వైసీపీ నుంచి కేకే రాజు రెండు సెట్లు, కాంగ్రెస్ నుంచి జి.గోవిందరాజు, స్వతంత్రులుగా బొర్రా రమేష్,సుమ, రోణంకి చలపతిరావు ఒక్కొక్క సెట్, విశాఖ పశ్చిమకు వైసీపీ తరపున ఆడారి ఆనంద్కుమార్ రెండు సెట్లు, జైభారత్ నేషనల్ పార్టీ నుంచి జె.వెంకటగణేష్ ఒక సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. పెందుర్తి అసెంబ్లీ స్థానానికి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్రాజ్, జనసేన నుంచి పంచకర్ల రమేష్బాబు, పంచకర్ల మహాలక్ష్మి, జైభారత్ నేషనల్ పార్టీ తరపున కె.మహదేవ్ కల్యాణ్శ్రీకాంత్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఈత రోజా, సమాజ్వాదీ పార్టీ నుంచి బోళెం వెంకట మురళీమోహన్, ఇండిపెండెంట్లుగా ఆడారి నాగరాజు, గుంటూరు వెంకటనరసింహామూర్తి, గుంటూరు సాయిప్రియ, కూండ్రపు సన్యాసిరావు ఒక్కొక్క సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గాజువాక, విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు రెండో రోజు కూడా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు.