ఎన్నికల ఖర్చుపై డేగ కన్ను
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:44 AM
ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కిస్తాయి. గెలిస్తే చేయనున్న పనులు, హామీ లు, గతంలో నేరవేర్చిన వాగ్దానాలు, నినాదాలు తదితర అంశాలతో ప్రచార సామగ్రిని సిద్ధం చేస్తాయి.
ప్రచార ఆర్భాటంపైనా నిఘా
ఖర్చు చేసిన ప్రతి రూపాయికీ లెక్క చెప్పాల్సిందే
లేదంటే కఠిన చర్యలు తీసుకోనున్న ఈసీ
ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కిస్తాయి. గెలిస్తే చేయనున్న పనులు, హామీ లు, గతంలో నెరవేర్చిన వాగ్దానాలు, నినాదాలు తదితర అంశాలతో ప్రచార సామగ్రిని సిద్ధం చేస్తాయి. ఓటర్లను ఆకట్టుకుని తమ వైపునకు తిప్పుకోవడం దీని ఉద్దేశం. ఇందుకోసం కరపత్రాలు, గోడపత్రికలు, ఫ్లెక్సీలు ముద్రిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రచారానికి సంబంధించిన ప్రచురణలకు కొన్ని మార్గదర్శకాలున్నాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే ప్రచారం హోరెత్తుతోంది. ఆయా పార్టీల నేతలు రాష్ట్ర నాయకత్వం పంపిన ప్రచార సామగ్రితో పాటు స్థానికంగా సిద్ధంచేసిన వాటితోనూ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ప్రచురణలపై ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రత్యేక ఉత్తర్వులు ఇవి...
పత్రికల్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రత్యేకంగా ఏ అభ్యర్థి తరఫున అయినా ప్రకటనలు ఇచ్చేందుకు ముద్రించే వారి పేరు, ప్రచురణ కర్త, ముద్రించిన ప్రకటన ప్రతిని సమర్పించాలి.
ముద్రణ పూర్తయ్యాక డిక్లరేషన్ ప్రతితో పాటు ముద్రించిన ప్రతిని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయాలి.
జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన ఏర్పాటవుతుంది. 2004 ఏప్రిల్ 13న సుప్రీంకోర్డు ఉత్తర్వులు, రాజ్యంగంలోని ఆర్టికల్ 142ప్రకారం ఈ కమిటీ నెలకొల్పారు. కమిటీ సభ్యులు స్థానిక వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, కరపత్రాలు, గోడపత్రాలను పరిశీలిస్తారు.
ఏ రాజకీయ పార్టీ నేత, అభ్యర్థి అయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆరు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది.
ఎలక్ర్టానిక్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి రాత ప్రతులు, సీడీ రెండు కాపీలు కమిటీ ఆమోదం కోసం 72 గంటల ముందుగా సమర్పించాలి. ప్రకటన ప్రసారం చేయాలనుకుంటున్న వ్యక్తి పూర్తి సమాచారం అందులో ఉండాలి.
ప్రకటనల తయారికి అయ్యే ఖర్చు, ప్రసార మాధ్యమాల్లో ప్రసారానికి అయ్యే ఖర్చు తెలపాలి.
పోలింగ్ రోజు, అంతకుముందు రోజు ప్రింట్ మీడియాలో వచ్చే ప్రకటనలకు ఎంసీఎంసీ ఆమోదం తప్పనిసరి.
పోటీచేసే అభ్యర్థి సామాజిక మాధ్యమ ఖాతా వివరాలను నామినేషన్ వెంట సమర్పించే ఫారం-26లో స్పష్టంగా పేర్కొనాలి.
అభ్యర్థి లేకుండా ఇతర వ్యక్తులు ప్రకటనలు ఇస్తే అందుకు సంబంధించిన ప్రమాణ పత్రం దాఖలు చేయాలి.
కుల, మతపరమైన ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు, ప్రలోభాలకు గురిచేయడం నిషేధం.
రేడియో, ప్రైవేట్ ఎఫ్ఎం, టీవీ ఛానళ్లు, కేబుల్ నెట్వర్క్, సోషల్ మీడియాపైనా పర్యవేక్షణ ఉంటుంది. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంటుంది.
గోడపత్రాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలు ముద్రించే వ్యక్తి డిక్లరేషన్ తాలూకు రెండు ప్రతులను వ్యక్తిగతంగా తెలిసిన ఇద్దరి సంతకాలతో ప్రింటర్కు ఇవ్వాలి. డిక్లరేషన్ నమూనాను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల నుంచి పొందాలి.
ఉక్కు టౌన్షిప్