ఊపందుకున్న నామినేషన్లు
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:24 AM
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకున్నది. రెండో రోజైన శుక్రవారం అనకాపల్లి లోక్సభ స్థానానికి నలుగురు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టణ్శెట్టి ఒక ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ (జనసేన) ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాహ్నవికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు అనకాపల్లి రింగురోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి రింగురోడ్డు కూడలి, చిన్న నాలుగురోడ్ల జంక్షన్, నెహ్రూచౌక్ మీదుగా గుండాల జంక్షన్ వద్ద ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు.
జిల్లాలో రెండో రోజు పది మంది దాఖలు
లోక్సభకు 4, శాసనసభకు 6..
నామినేషన్లు వేసిన అయ్యన్న, కొణతాల, కన్నబాబురాజు, పైలా
అనకాపల్లి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకున్నది. రెండో రోజైన శుక్రవారం అనకాపల్లి లోక్సభ స్థానానికి నలుగురు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టణ్శెట్టి ఒక ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ (జనసేన) ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాహ్నవికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు అనకాపల్లి రింగురోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి రింగురోడ్డు కూడలి, చిన్న నాలుగురోడ్ల జంక్షన్, నెహ్రూచౌక్ మీదుగా గుండాల జంక్షన్ వద్ద ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు (టీడీపీ) రిటర్నింగ్ అధికారి జయరామ్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు శివపురంలోని ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలు దేరి ఐదు రోడ్లు కూడలి, కృష్ణాబజార్, అబీద్ సెంటర్ మీదుగా సబ్కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి (బీజేపీ) సీఎం రమేశ్ అయ్యన్న నామినేషన్ల దాఖలు ప్రక్రియలో పాల్గొన్నారు. ఎలమంచిలి నుంచి వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు రిటర్నింగ్ అధికారి మనోరమకు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, ఎంపీ డాక్టర్ సత్యవతి, తదితరులు పాల్గొన్నారు. మాడుగుల అసెంబ్లీ స్థానానికి పైలా ప్రసాదరావు (టీడీపీ), పైలా ఈవీఎన్ నాయుడు (టీడీపీ), కరణం తిరుపతిరావు (బీఎస్పీ) నామినేషన్లు వేశారు.
కాగా అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు తరపున ఆయన సోదరుడు వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.
అనకాపల్లి ఎంపీ స్థానానికి ...
అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి నర్సీపట్నం మునిసిపాలిటీ గొర్లివీధికి చెందిన గవిరెడ్డి రమ (స్వతంత్ర), అనకాపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన కొన గురవయ్య యాదవ్ (సమాజ్వాదీ పార్టీ), మునగపాక మండలం అనపర్తి గ్రామానికి చెందిన కర్రి విజయలక్ష్మి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), విశాఖపట్నంలోని గోపాలపట్నం ప్రాంతానికి చెందిన నమ్మి అప్పలరాజు (భారత ఛైతన్య యువజన పార్టీ) నామినేషన్లు దాఖలు చేశారు. వీరి నుంచి జిల్లా రిటర్నింగ్ అధికారి రవి పట్టన్శెట్టి నామినేషన్లు స్వీకరించారు. కాగా పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గాలకు ఇంతవరకు ఒక్క నామినేషన్ కూడా పడలేదు.