చీపురుపల్లి నుంచి 11 జాతీయ పార్టీలు
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:12 AM
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏర్పాటైన చీపురుపల్లి నియో జకవర్గం... వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో 11 జాతీయ పార్టీలు పోటీ లో నిలిచేందుకు వేదికైంది. జిల్లాలో మరెక్కడా లేని విధంగా చీపురుపల్లి అసెంబ్లీ నుంచి ఎక్కువ సంఖ్యలో జాతీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలపడం విశేషం.
(చీపురుపల్లి)
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏర్పాటైన చీపురుపల్లి నియో జకవర్గం... వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో 11 జాతీయ పార్టీలు పోటీ లో నిలిచేందుకు వేదికైంది. జిల్లాలో మరెక్కడా లేని విధంగా చీపురుపల్లి అసెంబ్లీ నుంచి ఎక్కువ సంఖ్యలో జాతీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలపడం విశేషం. ఈ 11 జాతీయ పార్టీల్లో కేవలం భారత జాతీయ కాంగ్రెస్ తప్ప మరే పార్టీ ఇక్కడ విజయం సాధించలేదు. 1972లో జరిగిన ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా రౌతు పైడపునాయుడును రంగంలోకి దించింది.
- 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ (ఐ) పార్టీ చిగిలపల్లి శ్యామలరావును, భారత జాతీయ కాంగ్రెస్ కుచ్చర్లపాటి లక్ష్మీపతిరాజును, జనతా పార్టీ రౌతు పైడపునాయుడును పోటీలో నిలిపాయి.
- 1983లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)లు తమ వారిని ఎన్నికల్లో పోటీకి నిలిపాయి.
- 1985లో మాత్రం జాతీయ పార్టీ తరపున ఇక్కడ ఎవరూ పోటీ చేయలేదు.
- 1989లో లోక్దళ్ నుంచి దుగ్గిరాల కృష్ణకుమార్బాబు, జాతీయ కాంగ్రెస్ తరపున మీసాల నీలకంఠం నాయుడులు పోటీ చేశారు.
- 1994లో కూడా కాంగ్రెస్, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీలు వరుసగా కెంబూరి రామ్మోహనరావు, కోకా మాలతీదేవి, గుణుపూరు నరసింగరావులను తమ అభ్యర్థులుగా పోటీలో నిలిపాయి.
- 1999లో కాంగ్రెస్ తరపున నీలకంఠంనాయుడు, రిపబ్లికన్ పార్టీ ఇండియా నుంచి దండి అప్పారావులు పోటీకి దిగారు.
- 2004లో కాంగ్రెస్ తరపున బొత్స సత్యనారాయణ, బహుజన్ సమా జ్ పార్టీ నుంచి కిల్లి రాజమోహనరావులు పోటీ చేశారు.
- 2009లో తిరిగి భారత జాతీయ కాంగ్రెస్ బొత్స సత్యనారాయణను, బీజేపీ సాకేటి మోహనరావు ను, బహుజన సమాజ్ పార్టీ బైరెడ్డి అప్పలనాయుడును, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ పెందుర్తి వెంకటరావును పోటీలో నిలబెట్టాయి.
- 2014లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలు తమ అభ్యర్థులను నిలిపాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జమ్ము ఆదినారాయణను, బీజేపీ శంకర్లాల్ శర్మను, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అమరా శ్రీదేవిని ఎన్నికల్లో నిలిపాయి. ఇలా దాదాపు అర్ధ శతాబ్దం పాటు జాతీయ పార్టీలు చీపురుపల్లి నుంచి తమ అభ్యర్థులను పోటీకి దింపుతూ వస్తున్నాయి.