సారూ.. నమ్మొచ్చా?
ABN , Publish Date - Apr 27 , 2024 | 11:44 PM
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో చూసి ప్రజలు పెదవి విరుస్తున్నారు. అమలు చేయనివి సైతం చేసినట్లు పేర్కొనడాన్ని తప్పుబడుతున్నారు. గిరిజన వర్సిటీకి మరో ఐదేళ్లు పడుతుందని మళ్లీ ఎలా చెప్పగలుగుతున్నారని మండిపడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలిస్తామన్న మాటను కూడా నమ్మడం లేదు. ఈ ఐదేళ్లలో జాబ్ కేలండర్ దుస్థితిని ఉదహరిస్తున్నారు. కాగా ఫిష్ ఆంధ్రాను భేషుగ్గా అమలు చేసినట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కాని జిల్లాలో ఆ యూనిట్లన్నీ మూలకు చేరాయి. వైఎస్ఆర్ అగ్రి టెస్టు ల్యాబ్లదీ ఇదే పరిస్థితి. వైఎస్ఆర్ జలకళ, జలయజ్ఞం హామీలను కూడా ప్రజలు విశ్వసించడం లేదు.
సారూ.. నమ్మొచ్చా?
వైసీపీ ఎన్నికల హామీలపై పెదవి విరుపు
అనేక ప్రశ్నలు సంధిస్తున్న ప్రజలు
గిరిజన విశ్వవిద్యాలయానికి మరో ఐదేళ్లు
భోగాపురం విమానాశ్రయాన్నీ ఐదేళ్లలో పూర్తి చేస్తారట
ప్రారంభమే కాని అగ్రి టెస్టు ల్యాబ్
రైతులకు 9గంటల ఉచిత విద్యుత్ ఇప్పుడేది?
పింఛను పెంపు రూ.500.. అదీ నాలుగేళ్ల వరకు ఆగాలట
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో చూసి ప్రజలు పెదవి విరుస్తున్నారు. అమలు చేయనివి సైతం చేసినట్లు పేర్కొనడాన్ని తప్పుబడుతున్నారు. గిరిజన వర్సిటీకి మరో ఐదేళ్లు పడుతుందని మళ్లీ ఎలా చెప్పగలుగుతున్నారని మండిపడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలిస్తామన్న మాటను కూడా నమ్మడం లేదు. ఈ ఐదేళ్లలో జాబ్ కేలండర్ దుస్థితిని ఉదహరిస్తున్నారు. కాగా ఫిష్ ఆంధ్రాను భేషుగ్గా అమలు చేసినట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కాని జిల్లాలో ఆ యూనిట్లన్నీ మూలకు చేరాయి. వైఎస్ఆర్ అగ్రి టెస్టు ల్యాబ్లదీ ఇదే పరిస్థితి. వైఎస్ఆర్ జలకళ, జలయజ్ఞం హామీలను కూడా ప్రజలు విశ్వసించడం లేదు.
(విజయనగరం- ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం జిల్లాకు కేటాయించిన గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. పైగా వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని ఈ మేనిఫెస్టోలో పేర్కొంది. టీడీపీ హయాంలో కేంద్రం మంజూరు చేసిన గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఎక్కడ నిర్మించాలో తేల్చేందుకే మూడేళ్లు పట్టింది. తరువాత ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసినా ఇంతవరకు అడుగు కూడా కదలలేదు. ప్రస్తుతం పరాయిపంచలో తరగతులు నిర్వహిస్తున్నారు. 91 మంది బోధనా సిబ్బంది అవసరం కాగా 18మంది ఉన్నారు. కొన్ని పీజీ గ్రూపులే ఉన్నాయి. హాస్టల్ సౌకర్యం లేని కారణంగా విద్యార్థులు చేరేందుకు వెనకంజ వేస్తున్నారు. ఉన్నతమైన వర్సిటీని ఈ ప్రభుత్వం అభాసుపాలుచేసింది.
-- భోగాపురం విమానాశ్రయ పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. టీడీపీ హయాంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన దానికే మళ్లీ జగన్ శంకుస్థాపన చేశారు. నాలుగేళ్లుగా పట్టించుకోని జగన్ చివరి ఏడాదిలో శంకుస్థాపన చేశారు. తమ హయాంలో విమానాశ్రయ పనులను జీఎంఆర్కు అప్పగిస్తే ఏదో జరిగిందని గగ్గోలు పెట్టిన జగన్ మళ్లీ అదే సంస్థకు విమానాశ్రయ పనులు ఎలా అప్పగించారని చంద్రబాబు ఇటీవల ప్రశ్నించారు.
- ప్రస్తుతం సామాజిక పింఛను రూ.3వేలు అందిస్తున్నారు. దీనికి అదనంగా రూ.250 చొప్పున రెండు విడతల్లో రూ.500కు పెంచుతున్నట్లు కొత్త హామీల్లో పేర్కొన్నారు. అంటే 2029 ఎన్నికలు దగ్గర పెంచేందుకు నిర్ణయించారా అని పేదలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధికారంలో వస్తే పింఛను మొత్తాన్ని రూ.4వేలు చేస్తామని చెప్పిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.
- పాత పథకాలనే వచ్చే ఐదేళ్లలో కొనసాగిస్తామని పేర్కొన్నారు. చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తంలో మార్పు లేదు. టైలర్లకు ఏడాదికి పది వేలు పాత పథకమే.
- ఫిష్ ఆంధ్రా బేషుగ్గా అమలు చేసినట్లు పేర్కొన్నారు. కాని జిల్లాలోని పిష్ ఆంధ్రా యూనిట్లన్నీ మూలకు చేరాయి.
- వైఎస్ఆర్ టెస్టు ల్యాబ్లు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి నెలివాడ వద్ద నిర్మించారు. ప్రారంభానికీ నోచుకోకుండా రెండేళ్లుగా విడిచి పెట్టారు. మిషనరీయే రాలేదు.
- గ్రూప్-1, గ్రూప్-2తో పాటు ఉద్యోగ నియామక పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలో కూడా ఇదే మాదిరిగా జాబ్ క్యాలండర్ అంటూ ఆశలు రేపి ఎన్నికల ఏడాదిలో మాత్రమే కొద్దిపాటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.
- వైఎస్ఆర్ జలకళ పథకానికి వేలాది మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. బోర్లు వేసినవి, విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినవి చాలా తక్కువ. రిగ్ బోర్ యజమానులకు బిల్లులు చెల్లించని కారణంగా వారు మధ్యలో వెళ్లిపోయారు. మళ్లీ ఎన్నికల హామీల్లో ఈ పథకాన్ని వైసీపీ చేర్చింది.
- సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వచ్చే ఐదేళ్లలో మాత్రం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తారకరామతీర్ధ సాగర్, తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పెండింగ్ పనులను చూస్తున్న ప్రజలు ఈ హామీని కూడా నమ్మడం లేదు.
- ఏటా రైతు భరోసా పేరుతో రూ.13500 అందిస్తున్నారు కాని ఇందులో కేంద్రం అందిస్తున్న పిఎమ్ కిసాన్ రూ.6వేలు కలిసి ఉంది. ఇది మినహాయిస్తే జగన్ అందిస్తున్నది కేవలం రూ.7500. అందుకే తాజాగా రైతు భరోసాను రూ.16వేలకు పెంచుతున్నట్లు పేర్కొన్నా ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
- రైతులకు 9గంటల పాటు విద్యుత్ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు కాని ఏడు గంటలు మాత్రమే అందిస్తూ తొమ్మిది గంటలుగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజు రైతుల పంపుసెట్లకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అందిస్తున్నారు. అంటే ఆరు గంటలు మాత్రమే అందిస్తున్నారు. ఈ హామీని మళ్లీ చేర్చారు.
- జర్నలిస్టులకు 60శాతం రాయితీతో ఇళ్ల స్థలాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో అందివ్వలేదు.
- హిందూ దేవాలయాలను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మాత్రం వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసమే జరిగింది. రామతీర్థంలోని రాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
- కుల వృత్తులకు టీడీపీ ప్రభుత్వం ఆధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆదరణ పథకం ద్వారా కుల వృత్తిల వారికి పనిముట్లు అందించి జీవన ప్రమాణాలు పెంచింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వీటిని ఎత్తివేశారు. తాజా ఎన్నికల హామీల్లో కుల వృత్తులకు ప్రాధాన్యమని చేర్చారు. కానీ ఎవరూ నమ్మడం లేదు.
------------