రెండో రోజు ఎనిమిది నామినేషన్లు
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:48 AM
ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి.
ఏలూరు పార్లమెంట్కు రెండు, అసెంబ్లీ నియోజక వర్గాలకు 6 దాఖలు
ఏలూరు సిటీ/ ఏలూరు కలెక్టరేట్/ ఉంగుటూరు/దెందులూరు/కైకలూరు/ నూజివీడు ఏప్రిల్ 19 : ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. ఏలూరు పార్లమెంట్ స్థానానికి రెండు, జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావూరి లావణ్య, స్వతంత్ర అభ్యర్థిగా బొక్కినాల కోటేశ్వరరావు ఒక్కొక్క సెట్ చొప్పున కలెక్టరేట్లో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఉంగుటూరు కూటమి అభ్యర్థిగా పత్సమట్ల ధర్మరాజు (జనసేన) రిటర్నింగు అధి కారి ఖాజావలికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందించారు. దెందులూరు వైసీపీ అభ్యర్థిగా కొఠారు అబ్బయ్య చౌదరి ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఆర్వో లావణ్య వేణికి అందించారు. కైకలూరు కాంగ్రెస్ అభ్యర్థిగా బొడ్డు నోయల్, జీవన్ డానియెల్ నోబుల్ బొడ్డులు ఒక్కొక్క సెట్ చొప్పున, జైభీమ్రావు భారత్ పార్టీ తరపున గొంతుపులుగు సతీష్కుమార్ ఒక సెట్ నామినేషన్లు రిట్నరింగ్ అధికారి భాస్కర్కు అందజేశారు. ట్రావెలర్స్ బంగ్లా నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు జాతీయ రహదారిపై బారికేడ్లు పెట్టి ఇతరులు లోనికి రాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బొడ్డు నోబుల్ కైకలూరులోని అతని నివాసం నుంచి సుమారు 2వేల మంది కార్యకర్తలతో ఊరేగింపుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. నూజివీడు వైసీపీ అభ్యర్థిగా మేకా ప్రతాప్ అప్పారావు ఒక సెట్ నామినేషన పత్రాలను సబ్కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో వై.భవాని శంకరికి అందించారు. 23న అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మరోసెట్ను దాఖలు చేయను న్నారు. కాగా ఏలూరు, చింతలపూడి, పోలవరం నియోజక వర్గాలకు సంబంధించి రెండో రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.