వ్యయ రికార్డుల పరిశీలన
ABN , Publish Date - Apr 20 , 2024 | 01:08 AM
సార్వత్రిక ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గంలో పోటీకి దిగిన అభ్యర్థుల వ్యయాలను ఏలూరు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు పి.కీర్తినారాయణ్ శుక్రవారం పరిశీలించారు.
నూజివీడు, ఏప్రిల్ 19: సార్వత్రిక ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గంలో పోటీకి దిగిన అభ్యర్థుల వ్యయాలను ఏలూరు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు పి.కీర్తినారాయణ్ శుక్రవారం పరిశీలించారు. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆయన ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు, నమోదు రికార్డులను పరిశీలించారు. నియోజకవర్గంలో సర్వైలెన్స్ బృందాలు, అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించి, వ్యయ నమోదు ప్రక్రియ విధానాన్ని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గరిష్ఠ పరిమితికి మించి ఖర్చుచేస్తే ఎమ్మెల్యేగా అనర్హులు అవుతారని, ఎన్నికల వ్యయంపై అభ్యర్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తదితర అంశాలపై వ్యయాలను లెక్కించే విధానాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు నూజివీడు ఆర్డీవో వై.భవానిశంకరి మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. నూజివీడు నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఎన్నికల బృందాలు పాల్గొన్నాయి.