Share News

Hyderabad: ప్రేమలో విఫలమై.. డ్రగ్స్‌కు బానిసై.. చివరకు ఏమయ్యాడంటే..

ABN , Publish Date - May 11 , 2024 | 09:56 AM

ప్రేమ విఫలమై డ్రగ్స్‌కు బానిసైన ఓ యువకుడు.. డ్రగ్స్‌ స్మగ్లర్‌(Drug smuggler) అవతారమెత్తి స్నేహితులతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. చివరకు సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

Hyderabad: ప్రేమలో విఫలమై.. డ్రగ్స్‌కు బానిసై.. చివరకు ఏమయ్యాడంటే..

- స్మగ్లర్‌గా మారిన యువకుడు

- ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పాటు

- పోలీసుల నిఘాతో కటకటాల్లోకి..

- రూ. 3లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: ప్రేమ విఫలమై డ్రగ్స్‌కు బానిసైన ఓ యువకుడు.. డ్రగ్స్‌ స్మగ్లర్‌(Drug smuggler) అవతారమెత్తి స్నేహితులతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. చివరకు సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ముఠాలోని ముగ్గురిని ఈస్టుజోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.3లక్షల విలువైన 14.34 గ్రాముల కొకైన్‌, 3.66 గ్రాముల ఎండీఎంఏ, ఒక బైక్‌, 4 మొబైల్స్‌, 2 కొరియర్‌ ఎన్‌వలప్‌ కవర్స్‌ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రష్మి పెరుమాళ్‌ వివరాలు తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన అన్నదమ్ములు అబ్బుల సాయిశరత్‌, అబ్బుల శ్రవణ్‌.. బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి బేగంపేట(Begumpet)లో ఉంటున్నారు. వారిద్దరూ 2019లో బంజారాహిల్స్‌లో లిటిల్‌ ఇడ్లీ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అందులో ప్రొఫెషనల్‌ చెఫ్‌ అయిన సాయికిరణ్‌ను నియమించుకున్నారు. ఇదిలాఉండగా.. సాయిశరత్‌ ఓ యువతి ప్రేమలో పడి విఫలం కావడంతో మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో సాయికిరణ్‌ ద్వారా యూస్‌ఫగూడకు చెందిన శ్రీవాస్తవ్‌రిషబ్‌ పరిచయం అయ్యాడు. అప్పటికే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన సాయిశరత్‌.. రిషబ్‌తో కలిసి డ్రగ్స్‌కు బానిసయ్యారు.

ఇదికూడా చదవండి: Chicken rice: చికెన్‌రైస్‏లో విషం కలిపి.. తాతను హతమార్చిన మనవడు

ముంబై నుంచి కొరియర్‌లో డ్రగ్స్‌..

డ్రగ్స్‌కు అలవాటు పడిన రిషబ్‌, సాయిశరత్‌లు వారితోపాటు శ్రవణ్‌ను చేర్చుకొని ముఠాగా ఏర్పడ్డారు. డ్రగ్స్‌ను వ్యాపారంగా మార్చుకొని డబ్బులు సంపాదించాలని పథకం వేశారు. సాయిశరత్‌ ముంబైకి చెందిన ఒక డ్రగ్‌స్మగ్లర్‌ కాంటాక్టు సంపాదించి అవసరమైన సరుకును కొనుగోలు చేసేవాడు. అతను కొరియర్‌ ద్వారా సరుకును పంపేవాడు. ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా ఎన్‌వలప్‌ కవర్‌లో డాక్యుమెంట్స్‌ పంపుతున్నట్లుగా పార్శిల్‌ చేసి కొరియర్‌లో పంపేవాడు. దాన్ని శ్రవణ్‌ డెలివరీ తీసుకునేవాడు. ఆ తర్వాత శ్రీవాస్తవ్‌రిషబ్‌ నగరంలోని కస్టమర్స్‌కు సరఫరా చేసేవాడు. కొంతకాలంగా డ్రగ్స్‌ దందాకు పాల్పడుతున్న ముఠా గురించి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దాంతో వారిపై నిఘా పెట్టారు. ముంబై నుంచి వచ్చిన సరుకును బేగంపేటలో కొరియర్‌ ద్వారా తీసుకున్న శ్రవణ్‌ దాన్ని రిషబ్‌కు ఇవ్వడానికి జలవిహార్‌కు వెళ్లాడు. వారిపై నిఘా పెట్టిన పోలీసులు లేక్‌ పోలీసులతో కలిసి వారిని పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. లేక్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 14 ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం..

Read Latest Crime News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 11 , 2024 | 09:56 AM