Share News

లక్ష్మీనృసింహుడి సాక్షిగా చెబుతున్నా.. పంద్రాగస్టులోగా 2లక్షల రుణమాఫీ

ABN , Publish Date - Apr 22 , 2024 | 05:37 AM

‘యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చెబుతున్నా..! ఏది ఏమైనా సరే.. పంద్రాగస్టులోగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. వచ్చే పంట నుంచే వరికి రూ.500 బోనస్‌ ఇచ్చి, ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి

లక్ష్మీనృసింహుడి సాక్షిగా చెబుతున్నా.. పంద్రాగస్టులోగా 2లక్షల రుణమాఫీ

వచ్చే పంట నుంచి వరికి రూ.500 బోనస్‌.. గుట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తా

60 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన.. సాగునీటి కాల్వలను పూర్తి చేస్తాం

నాతోపాటు సీఎం అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి.. సీఎం పదవి నాకు బాధ్యత

సర్కార్‌ను ఎందుకు కూలగొడతారు?.. ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకా??

కేసీఆర్‌ బిడ్డకు బెయిల్‌ రావాలంటే భువనగిరిలో బీజేపీ గెలవాలంట!

బీఆర్‌ఎస్‌, బీజేపీని వామపక్షాలు బొందపెట్టాలి.. భువనగిరి ప్రచారంలో రేవంత్‌

3 జిల్లాల్లో నేడు రేవంత్‌ పర్యటన.. నామినేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం

యాదాద్రి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ‘‘యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చెబుతున్నా..! ఏది ఏమైనా సరే.. పంద్రాగస్టులోగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. వచ్చే పంట నుంచే వరికి రూ.500 బోనస్‌ ఇచ్చి, ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన రోడ్‌షోలో, అంబేడ్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. యాదగిరిగుట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తానని, కుర్చీవేసుకుని.. ఇక్కడే కూర్చుని మరీ ఆ పనులు చేయిస్తానని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఈ సందర్భంగా పొగడ్తలతో ముంచెత్తారు. తనతోపాటు.. సీఎంగా పనిచేసే అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సీఎం పదవి తనకు అర్హత కాదని.. ఒక బాధ్యత అని చెప్పారు. ‘‘భూమికి మూరెడు లేనోడికి చెబుతున్నా..! కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఫాంహౌ్‌సలో మందులో సోడా కలిపి రాజకీయాల్లోకి రాలేదు. సొంత ఆస్తులు కరగబెట్టి సేవ చేసిండ్రు. మంత్రి పదవిని తాగ్యం చేసి.. నల్లగొండ గడ్డపై నిరవధిక నిరహార దీక్ష చేశారు. అధిష్ఠానాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్ర సాధనకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ కృషిచేశారు. తెలంగాణ వచ్చాకే.. మంత్రి పదవి తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. బీఆర్‌ఎస్‌ వాళ్లు అడవి పందుల్లా మెక్కి బలిసిండ్రు. కేసీఆర్‌ వామపక్షాల మద్దతు తీసుకున్నారు. కానీ, వారికి కనీస గౌరవం ఇవ్వలేదు. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల మేర అప్పులపాలు చేశారు’’ అని వ్యాఖ్యానించారు. స్థానిక నేతలు ఎప్పుడైనా తనను కలవొచ్చని పేర్కొన్నారు.

కిరణ్‌ను గెలిపిస్తే..భువనగిరిలో ట్రిపుల్‌ ఇంజన్‌

‘‘అటువైపు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఇటు వైపు కోమటిరెడ్డి బ్రదర్స్‌.. మనకు మనమే పోటీ పడి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని 3 లక్షల మెజారిటీతో గెలిపించాలి. భువనగిరిలో ఇప్పటికే డబుల్‌ ఇంజన్‌(కోమటిరెడ్డి బ్రదర్స్‌) ఉంది. కిరణ్‌ను గెలిపిస్తే ట్రిపుల్‌ ఇంజన్‌ అవుతుంది’’ అని రేవంత్‌రెడ్డి కోరారు. గందమళ్ల, డిండి, బస్వాపూర్‌ రిజర్వాయర్‌లను, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తిచేస్తామని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి, బూనాదిగాని కాల్వలను పునరుద్ధరించేందుకు నిధులను కేటాయిస్తామన్నారు. రూ.60 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేపడతామని, భువనగిరిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘‘ప్రభుత్వ విప్‌లుగా, రాజ్యసభ్య సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా బడుగు బలహీనవర్గాల నేతలకు అవకాశం కల్పించాం. బీసీ జనాభా లెక్కల ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టేలా తగిన చర్యలు తీసుకుంటాం. బీఆర్‌ఎస్‌ కుటుంబ న్యాయం చేయగా.. కాంగ్రెస్‌ సామాజిక న్యాయం చేస్తుంది. ఎలక్షన్లు, కలెక్షన్ల పేరుతో కేసీఆర్‌ హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రాప్రాంత వ్యాపారుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు దోచుకున్నారు. పదేళ్లపాటు తెలంగాణ తల్లి కేసీఆర్‌ గడీలో కన్నీళ్లు పెట్టుకుంది. ప్రజాధనంతో కట్టిన ప్రజాభవన్‌ను కేసీఆర్‌ గడీగా మార్చారు. గడీల పాలనను బద్ధలు కొట్టి, ప్రజాపాలనను తీసుకొచ్చాం’’ అని వ్యాఖ్యానించారు.

సర్కారును ఎందుకు కూలగొడతారు?

‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా కాకముందే కూలగొడతామని.. లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని కేసీఆర్‌ అంటున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నందుకు మా ప్రభుత్వాన్ని కూలగొడతారా? మమ్మల్ని ఓడిస్తారా? కేసీఆర్‌ సర్కారు నిరుద్యోగుల ఆశలకు గండికొడితే.. మేము ప్రజాపాలనలో మూణ్నెల్లలో 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల బీమా ఇస్తున్నాం. రూ.400 నుంచి రూ.1200 పెంచిన గ్యాస్‌ ధరల భారాన్ని.. 40 లక్షల పేద కుటుంబాల తరఫున రూ.500 చొప్పున భరిస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నందుకు మా ప్రభుత్వాన్ని కూలగొడతారా?’’ అని రేవంత్‌రెడ్డి నిలదీశారు. మరోసారి కేసీఆర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఆయన లాగులో తొండలు వేసి, కొట్టిస్తామని హెచ్చరించారు. ‘‘ఇదేమైనా ఫుల్‌ బాటిలా? పడిపోవడానికి?? ప్రభుత్వం పడిపోతదని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతాం’’ అని వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ అని.. భువనగిరి ఖిల్లా కాంగ్రెస్‌ అడ్డా అని స్పష్టం చేశారు.

మోదీ, కేడీ ఒక్కటే..

కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో కేడీ(కేసీఆర్‌) ఇద్దరూ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పదేళ్లలో పార్లమెంట్‌లో అనేక బిల్లులకు బీఆర్‌ఎస్‌ పూర్తి సహకారం అందించిందని గుర్తుచేశారు. బీజేపీ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీలేదని, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేసిందని విమర్శించారు. ‘‘భువనగిరి నుంచి కుర్మ నేత క్యామ మల్లేశ్‌ను బీఆర్‌ఎస్‌ బరిలో దింపింది. వెనుక నుంచి బూరకు కేసీఆర్‌ బూర ఊదుతున్నారు. బిడ్డ(ఎమ్మెల్సీ కవిత)కు బెయిల్‌ రావాలంటే భువనగిరిలో బీజేపీ గెలవాలంట!’’ అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర అవతరణను అవమానించిన బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే నైతికతను లేదన్నారు. ఇండియా కూటమి గెలుపుతో రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని తెలిపారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీని బొందపెట్టాలి

కమ్యూనిస్టులకు రేవంత్‌ పిలుపు

బీఆర్‌ఎస్‌, బీజేపీలను బొందపెట్టడానికి కమ్యూనిస్టులు కలిసి రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మతం, దేవుడి పేరుతో.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ మాత్రం ప్రజాస్వామ్యం, రాజ్యాంగ రక్షణే లక్ష్యంగా పనిచేస్తోందని వివరించారు. ఇప్పటికే సీపీఐ తమతో కలిసి పనిచేస్తోందని.. మరో వామపక్ష పార్టీ కూడా తమ నిర్ణయంపై పునరాలోచన చేసుకోవాలని కోరారు.

3 జిల్లాల్లో నేడు రేవంత్‌ పర్యటన

నామినేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం

ఆదిలాబాద్‌/నిజామాబాద్‌ అర్బన్‌/మేడ్చల్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి) : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్‌ చేరుకోనున్న సీఎం.. పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. అక్కడి నుంచి 12.30 గంటలకు నిజామాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. నిజామాబాద్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం పాత కలెక్టరేట్‌ మైదానంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలాగే, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని అంతాయపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభకూ సీఎం హాజరుకానున్నారు. మల్కాజిగిరి అభ్యర్థి సునీతామహేందర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలోనూ పాల్గొంటారు. ఈ మేరకు మూడు జిల్లాల్లోనూ కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నిజమాబాద్‌ సభ ఏర్పాట్లను షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తదితరులు పరిశీలించారు.

Updated Date - Apr 22 , 2024 | 05:38 AM