పార్లమెంటు ఎన్నికల్లో స్థానికులకే ఓటు వేయాలి
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:56 AM
పార్లమెంటు ఎన్నికల్లో స్థానికులకే ఓటు వేయాలని బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ గొమాసే కోరారు.
పెద్దపల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ఎన్నికల్లో స్థానికులకే ఓటు వేయాలని బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ గొమాసే కోరారు. ఆయన బుధవారం తన సతీ మణితో పాటు బీజేపీ నాయకులు ఎస్ కుమార్, అమరేందర్ రావుతో కలిసి నామి నేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కానున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన అభ్యర్థులకు ఓట్లు వేయవద్దని, స్థానికులను గుర్తించి ఓటు వేయాలన్నారు. కేంద్రంలో సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గొమాసే శ్రీనివాస్ కోరారు.