సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Apr 23 , 2024 | 11:31 PM
సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూనే, డయల్-100పై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ రితిరాజ్ ప్రజలకు సూచించారు.
- కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఎస్పీ రితిరాజ్
ధరూరు/ గద్వాల, ఏప్రిల్ 23 : సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూనే, డయల్-100పై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ రితిరాజ్ ప్రజలకు సూచించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పోలీసుల సాయం పొందాల్సి వస్తే, వెంటనే డయల్-100కు కాల్ చేయాలని చెప్పారు. మండల కేంద్రంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కమ్యూనిటీ కాం టాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అపరిచితుల నుంచి ఎస్ఎంఎస్, ఈ మెయిల్, వాట్సప్ల ద్వారా వచ్చే బ్లూ కలర్ లింక్స్ను క్లిక్ చేస్తే, మీ మొబైల్లోని డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోతుందని హెచ్చరించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో జరిగే నష్టాలు, పోక్సో కేసుల పర్యవసానాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, రైతు లు భూమిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే సమయంలో మోసపోకుండా ఉండేందుకు తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై అవహగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ విజయ్కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు. అనంతరం అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపికైన కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామా నికి చెందిన ఎం.సునీత, జన్యుశాస్త్రంలో డాక్టరేట్ సాధించిన మేళ్లచెరువు గ్రామానికి చెందిన సుధా రాణిలను ఎస్పీ అభినందించారు.
రహదారి నిబంధనలను పాటించాలి
రహదారి నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను నివారించొచ్చని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం రాత్రి జమ్మిచేడు గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాహనదారులు ప్రయాణిస్తున్నప్పుడు సైన్ బోర్డులను గమనిస్తూ వెళ్లాలని సూచించారు. అతి వేగం అనర్థాలకు దారితీస్తుందన్నారు. వాహనం నడిపేటప్పడు ఇంటివద్ద మనకోసం భార్యా పిల్లలు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఉచితాలకు మోసపోవద్దని, సైబర్ నేరగాళ్లు మీకోసం ఆన్లైన్లో వేచి ఉంటారని హెచ్చరించారు. షీటీం సభ్యులు మాట్లాడుతూ వేధింపులు ఎదురైతే 8712670312లకు ఫోన్ చేయాలని, లేకపోతే 1930, 100 నెంబర్లకు గానీ ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని మహిళలు, విద్యార్థినులకు సూచించారు. అనంతరం కళాజాత బృందం సభ్యులు వివిధ అంశాలపై ఆటపాటలతో ప్రజలకు అవ గాహన కల్పించారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ పర్వతాలు, హెడ్కానిస్టేబుల్ రాధమ్మ, కళాబృందం సభ్యులు హన్మంతు, కృష్ణ, రామాంజనేయులు, భరోసా సిబ్బంది పాల్గొన్నారు.